బంగ్లాను అడ్డుపెట్టి భారత్ పై చైనా వికృత క్రీడ..! తీస్తా నుంచి మోంగ్లా వరకూ..!
బంగ్లాదేశ్ పై చైనా ఆర్థిక, రక్షణ రంగాల వ్యూహాత్మక ప్రాబల్యం వేగంగా విస్తరిస్తుండటం భారత్కు కొత్త ఉపద్రవంగా మారుతోంది. ముఖ్యంగా మొంగ్లా నౌకాశ్రయం నియంత్రణ బీజింగ్ హస్తగతం కావడం, తీస్తా నది ప్రాజెక్టులో చైనా ప్రత్యక్షంగా భాగస్వామ్యం కావడం భారత సరిహద్దు సమీపంలో భద్రతా సవాళ్లను పెంచుతున్నాయి. బంగాళాఖాతంలో భారత్ను వ్యూహాత్మకంగా చుట్టుముట్టేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు వాస్తవ రూపం దాలుస్తున్నాయని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
భారత్ కు ముప్పుగా చైనా చర్యలు
గతంలో 2015 ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం భారత్కు లభించాల్సిన మొంగ్లా పోర్టులోని 110 ఎకరాల ప్రత్యేక ఆర్థిక జోన్ను, బంగ్లాదేశ్ ఇప్పుడు చైనా ప్రభుత్వ రంగ సంస్థకు కేటాయించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నిర్ణయంతో బంగాళాఖాతంలో చైనా నౌకాదళానికి కీలకమైన నిఘా స్థావరం లభించినట్లవుతుంది. ఫలితంగా ఈ ప్రాంతంలో భారత రక్షణ ప్రాధాన్యతలకు గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందని రక్షణ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఆధునిక సాంకేతికతతో నిఘా ముప్పు
మొంగ్లా, చిట్టగాంగ్ నౌకాశ్రయాలలో చైనా నిర్మించే మౌలిక సదుపాయాలలో అత్యాధునిక నిఘా పరికరాలు, లాజిస్టిక్స్ ప్లాట్ఫారమ్లు ఉండే అవకాశం ఉంది. వీటి సహాయంతో బంగాళాఖాతం మీదుగా ప్రయాణించే వాణిజ్య, రక్షణ నౌకల కదలికలను బీజింగ్ నిరంతరం పర్యవేక్షించవచ్చని భావిస్తున్నారు. విశాఖపట్నం, కోల్కతా రేవుల నుంచి బయలుదేరే భారత యుద్ధనౌకల రహస్య గమనాలను గుర్తించడానికి కూడా చైనా ఈ వ్యవస్థలను ఉపయోగించే ప్రమాదం ఉంది.
మరో కీలక పరిణామం ఏమిటంటే, తీస్తా నది నిర్వహణ ప్రాజెక్టులో చైనా ఇంజనీర్లు, సాంకేతిక అధికారులను భాగస్వామ్యం చేయడం. వ్యూహాత్మకంగా అత్యంత సున్నితమైన 'సిలిగురి కారిడార్' లేదా 'చికెన్స్ నెక్' సమీపంలో చైనా శక్తులు మోహరించడం భారత సరిహద్దు రక్షణకు తీరని నష్టం కలిగించవచ్చు. ఈ ప్రాంతం ఈశాన్య రాష్ట్రాలను భారతదేశంతో అనుసంధానించే ఏకైక మార్గం కావడం వల్ల, సరిహద్దు నిఘాను చైనా మరింత సులభం చేసుకోగలదు.

ప్రాంతీయ సమీకరణాల మార్పు
పాకిస్తాన్ లోని గ్వాదర్ బేస్, మయన్మార్లోని క్యుక్ప్యు, బంగ్లాదేశ్ పోర్టులను అనుసంధానిస్తూ భారత్ చుట్టూ ఒక పెద్ద నిఘా వలయాన్ని నిర్మించాలనేది చైనా ప్లాన్. దీనితో పాటు బంగ్లాదేశ్కు జే-10సీఈ యుద్ధవిమానాలను విక్రయించేందుకు రక్షణ చర్చలు జరపడం హిందూ మహాసముద్ర ప్రాంతంలో సైనిక సంతులనాన్ని మార్చగలదు. పొరుగు దేశంలో చోటుచేసుకుంటున్న ఈ వేగవంతమైన మార్పులపై భారత్ తన రక్షణ వ్యూహాలను నిరంతరం సమీక్షించుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.














Click it and Unblock the Notifications