బంగ్లాదేశ్ కు భారత్ గుడ్ న్యూస్..! పాక్, చైనా దూకుడుకు కళ్లెం.. !
ఒకప్పుడు పాకిస్తాన్ తూర్పు భాగాన్ని విడదీసి బంగ్లాదేశ్ (Bangladesh) ఏర్పాటు చేసిన భారత్ (India)కు కొంతకాలంగా ఆ దేశంతో సంబంధాల్లో తేడా వచ్చేసింది. ముఖ్యంగా షేక్ హసీనాను అక్కడ జెన్ జీ ఉద్యమం గద్దె దింపిన తర్వాత భారత్ కు వచ్చి ఆశ్రయం పొందడం, ఇప్పటికీ భారత్ ఆమెను తిరిగి అప్పగించకపోవడం వంటి కారణాలతో రెండేళ్లుగా ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ మధ్యలో బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు, దీనిపై భారత్ లో నిరసనలు కూడా జరిగాయి. దీంతో భారత్ బంగ్లాదేశ్ పౌరులకు టూరిస్టు వీసాలు (Tourist visas) తగ్గించేసింది.
ఇప్పుడు తిరిగి మారుతున్న పరిణామాలతో బంగ్లాదేశీయులకు భారత్ లో టూరిస్టు వీసాలు మంజూరు చేయాలని కేంద్రం నిర్ణయించింది. గతంలో బంగ్లాదేశ్లోని తమ దౌత్య కార్యాలయాలపై జరిగిన దాడుల నేపథ్యంలో వీసా కార్యకలాపాలను తగ్గించిన దాదాపు రెండేళ్ల తర్వాత జూన్ 28 నుండి బంగ్లాదేశ్ జాతీయులకు పర్యాటక వీసాల జారీని తిరిగి ప్రారంభించనుంది.ఇవాళ ఢాకాలోని జమునా ఫ్యూచర్ పార్క్లో ఉన్న ఇండియన్ వీసా అప్లికేషన్ సెంటర్ (IVAC)ను సందర్శించిన సందర్భంగా బంగ్లాదేశ్లోని భారత హైకమిషనర్ దినేష్ త్రివేది ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.

పర్యాటక వీసాల కోసం సాధారణ వీసా దరఖాస్తులను తిరిగి ప్రారంభిస్తున్నామని ఆయన ప్రకటించారు. వీటిని జూన్ 28 ఆదివారం నుండి సమర్పించవచ్చన్నారు. వైద్య వీసాలు, మానవతా దృక్పథంతో కూడిన ఇతర అత్యవసర దరఖాస్తులకు భారత్ సౌకర్యం కల్పిస్తూనే ఉంటుందన్నారు. పర్యాటక వీసా దరఖాస్తులను ప్రారంభంలో ఢాకా, రాజ్షాహి, చిట్టగాంగ్, సిల్హెట్, ఖుల్నాలలో ఉన్న ఐదు భారతీయ వీసా దరఖాస్తు కేంద్రాల ద్వారా స్వీకరిస్తారు. భవిష్యత్తులో ఈ సేవను మరింత విస్తరించాలని భావిస్తున్నట్లు త్రివేదీ తెలిపారు. ఇది మన సార్వభౌమ దేశాల మధ్య ప్రజల సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని ఆశిస్తున్నామన్నారు.
బంగ్లాదేశ్ లో భారత్ సంబంధాలు మెరుగుపడేలోపే చైనా, పాకిస్తాన్ తో ఆ దేశం సంబంధాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.














Click it and Unblock the Notifications