కె చంద్రశేఖర రావుకు చెక్: కాంగ్రెసు తెలంగాణ ప్లాన్ రెడీ
గతంలో తెలుగుదేశం పార్టీపై, ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై తీవ్రంగా ధ్వజమెత్తిన కెసిఆర్ ఇప్పుడు కాంగ్రెసును నామరూపాలు లేకుండా చేసే వ్యూహంతో కదులుతున్నట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో పార్టీని కాపాడుకోవడానికి రంగంలోకి దిగక తప్పని స్థితి కాంగ్రెసుకు ఏర్పడింది. పార్టీని కాపాడుకోవడానికే తాము నిరాహార దీక్షకు దిగుతున్నామని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ అనడాన్ని బట్టి వారి ఉద్దేశం ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
మాటలు ఎన్ని చెప్పినా కాంగ్రెసు నాయకులను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. విద్యార్థుల మీద కేసుల ఎత్తివేతపై కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు నోరు మెదపకపోవడం కూడా కెసిఆర్ కు ఆ ఆయుధంగా లభించింది. దాన్ని పదే పదే కెసిఆర్ ఎత్తి చూపుతున్నారు. పదవులపై ఉన్న ఆశ, ఆసక్తి, వెంపర్లాట కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులకు తెలంగాణపై లేదనే అభిప్రాయం బలంగా నాటుకుంది. ఈ స్థితిలో కార్యాచరణకు దిగక తప్పని అనివార్యత తెలంగాణ కాంగ్రెసు నాయకులకు ఏర్పడింది. విద్యార్థులపై కేసుల ఎత్తివేత డిమాండ్ ఉద్యమాన్ని ముందుకు నడిపించడం ద్వారా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కూడా తాము పోరాటం చేస్తామని సందేశాన్ని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు తెలంగాణ ప్రజలకు ఇవ్వదలుచుకున్నట్లు అర్థం చేసుకోవచ్చు.
కాగా, తెలంగాణపై ఎఐసిసి అధికార ప్రతినిధి షకీల్ అహ్మద్ చేసిన ప్రకటన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల కాంగ్రెసుపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏకాభిప్రాయ సాధన అంటూ ఆయన మాట్లాడిన తీరు ఆ అనుమానాలకు కారణమవుతోంది. శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామని కూడా ఆయన చెప్పారు. ఆ నివేదిక ఎలా ఉంటుందో, కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో అనే ఉత్కంఠ నెలకొని ఉంది. తెలంగాణ కోసం ఉధృతమైన పోరాటం చేయకతప్పదని కెసిఆర్ చెబుతూ వస్తున్నారు.
ఆ పోరాటంలో తాము ముందు ఉంటామని, కెసిఆర్ కన్నా ఉధృతంగా తాము పోరాటం చేస్తామని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు చెప్పదలుచుకున్నట్లు తెలుస్తోంది. కేసుల ఎత్తివేత క్రెడిట్ కెసిఆర్ కు దక్కకూడదని వారు భావిస్తున్నారు. అందుకే, రోడ్డుపైకి వచ్చి నిరాహార దీక్షకు దిగారు.