కోమాలో మద్దెలచెర్వు సూరి, వెనక నుంచి దండగుల కాల్పులు
ముసుగులు ధరించిన వ్యక్తులు సూరిపై దాడి చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దాడి జరిపిన వెంటనే పక్కవీధిలోకి దుండగులు పారిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా, టూవీలర్పై వచ్చిన ఇద్దరు దుండగులు దాడి చేశారని కూడా వార్తలు వస్తున్నాయి. పాయింట్ బ్లాంక్ రేంజ్లో దండగులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. కారులో ఉండగా కాల్పులు జరిపారా, కారు వద్దకు వెళ్తుండగా కాల్పులు జరిపారా అనేది తెలియడం లేదు. కారు వెనక అద్దాలు పగిలి ఉన్నాయి.
సూరిపైకి దుండగులు ఐదు రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఓ న్యాయవాదితో మాట్లాడి వస్తుండగా దుండగులు అతనిపై దాడి చేసినట్లు చెబుతున్నారు. పరిటాల రవి హత్య కేసులో సూరి బెయిల్పై ఉన్నాడు. అతను ప్రాణభయంతో బెంగళూర్లో స్థిరపడ్డాడు. అయితే, తరుచుగా హైదరాబాద్ వచ్చిపోతున్నాడు. తీవ్రంగా గాయపడిన సూరిని అతని అనుచరులు స్విఫ్ట్ కారులో అపోలో ఆస్పత్రికి చేర్చారు.
ఏం జరిగిందనే విషయంపై పోలీసులు గానీ అతని అనుచరులు గానీ ఏమీ మాట్లాడడం లేదు. సూరి నోటి వెంట రక్తం కారుతున్న దృశ్యాలను టీవీ చానెళ్లు ప్రసారం చేస్తున్నాయి. ఎనిమిది మంది వైద్యులు అతనికి చికిత్స చేస్తున్నట్లు తెలుస్తోంది.