ప్రత్యేక తెలంగాణ ఇస్తే సోనియా కాళ్లు కడగడానికి రెడీ: కెసిఆర్
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ రాజకీయ నిర్ణయం ఫైనల్ అని ఆయన అన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత రాజకీయ పార్టీల అభిప్రాయం అవసరం లేదని, కేంద్రమే నిర్ణయం తీసుకోవచ్చునని ఆయన అన్నారు. ఏడాది కిందటి ప్రహసనాన్నే పునరావృతం చేయడానికి అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నప్పుడు తాము దానికి హాజరు కావాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. రేపటి అఖిల పక్ష సమావేశంలో చిదంబరం ఏమీ తేల్చబోరని ఆయన అన్నారు.
2004లో తెలంగాణ ప్రజల వల్లనే కాంగ్రెసు అధికారంలోకి వచ్చిందని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యత కాంగ్రెసు పార్టీది, సోనియా గాంధీదని ఆయన అన్నారు. తాను తెలుగుదేశం పార్టీ నాయకులను తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శలు వస్తున్నాయని ప్రశ్నించగా, తాను ప్రయత్నించడం లేదని, ప్రజల ఆకాంక్షల మేరకు తెలుగుదేశం నాయకులు నిర్ణయం తీసుకుంటున్నారని ఆయన అన్నారు.
ఒక పార్టీకి ఒకే జెండా ఉంటుందని, ఒకే విధానం ఉంటుందని, ఆ మేరకే ఎన్నికల్లో పోటీ చేస్తుందని, తెలంగాణపై ఒకే పార్టీ రెండు విధానాలను ప్రదర్శించడం సరి కాదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాము 50 ఏళ్లుగా పోరాడుతున్నామని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాము మహాత్మా గాంధీ చూపిన మార్గంలో సహాయ నిరాకరణ ఉద్యమం చేస్తామని ఆయన అన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి 15 రోజులు సరిపోతుందని ఆయన అన్నారు.