శ్రీకృష్ణ కమిటీ నివేదిక: ఎక్కడ వేసిన గొంగళి అక్కడే
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటించగానే సీమాంధ్ర నాయకులు పార్టీలకు అతీతంగా వ్యతిరేకించి రాజీనామాలు చేశారు. దాంతో కేంద్ర హోం మంత్రి వెనక్కి తగ్గారు. దాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణలో ఉద్యమాలు చెలరేగాయి. తెలంగాణ, సీమాంధ్ర మధ్య కొనసాగుతున్న విభేదాలు, భిన్న వాదనల నేపథ్యంలో ఆ సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీని వేసింది. ఆ సమస్యకు శ్రీకృష్ణ కమిటీ నివేదిక సూచించిన పరిష్కారం ఏదీ లేదు. అందువల్ల ఇరు ప్రాంతాల రాజకీయ నాయకుల మధ్య నెలకొన్న విభేదాలు అలాగే కొనసాగుతాయి. ఇప్పటికే తెలంగాణలో ఆందోళనలు ఊపందుకున్నాయి.
శ్రీకృష్ణ కమిటీ చేసిన సిఫార్సులు కూడా గందరగోళంగా ఉన్నాయి. ఆచరణ సాధ్యం కావంటూ మూడు సూచనలు చేయడం విచిత్రమే. ఆచరణ సాధ్యం కాని ప్రత్యామ్నాయాలు ఇవ్వడం ఎందుకో అర్థం కాదు. మొత్తంగా విశ్లేషణలో కూడా లోతు లేదు. పైపైన లెక్కలు చూపి విశ్లేషణ చేసినట్లుగా ఉంది. తెలంగాణలో వ్యవసాయానికి విద్యుతు వాడకంపై, తెలంగాణలో సాగు నీటి ప్రాజెక్టులు చేపట్టకపోవడంపై కమిటీ చేసిన విశ్లేషణను అందుకు ఉదాహరణగా చెప్పవచ్చు.