కాంగ్రెసులో ముసలం: మొయిలీ ఉండగానే హైదరాబాద్ చేరిన ఆజాద్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఆజాద్కు పూర్తి అవగాహన ఉంది. అంతేకాకుండా రాష్ట్రానికి చెందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులతో ఆయనకు సాన్నిహిత్యం కూడా ఉంది. ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి పేరును ఖరారు చేసిన సందర్భంలో కూడా ఆజాద్ను ప్రత్యేకంగా సోనియా గాంధీ హైదరాబాదుకు పంపారు. తెలంగాణ అంశంపై చేపట్టాల్సిన చర్యలపై, వైయస్ జగన్తో వెళ్లిన శాసనసభ్యులతో వ్యవహరించాల్సిన పరిస్థితిపై ఆయన బేరీజు వేసే అవకాశాలున్నాయి. జగన్ దీక్ష కన్నా తెలంగాణ ప్రాంత పార్టీ నాయకుల ప్రత్యేక సమావేశం అధిష్టానాన్ని ఎక్కువగా కలవరపెట్టినట్లు తెలుస్తోంది. మునుపెన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడారు. దీంతో వారికి నచ్చజెప్పడం ఎలా అనే విషయంపైనే ఎక్కువగా ఆజాద్ దృష్టి పెట్టే అవకాశాలున్నాయి.
ఆజాద్ రావడానికి ముందు వీరప్ప మొయిలీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) డి. శ్రీనివాస్ పరిస్థితిని సమీక్షించారు. ఏం చేయాలనే విషయంపై వారు తీవ్రంగా మథనపడినట్లు సమాచారం. డిఎస్ హెచ్చరికలు జారీ చేసినా, వీరప్ప మొయిలీ ఆదేశించినా వినకుండా పార్టీ శాసనసభ్యులు వైయస్ జగన్ దీక్షకు వెళ్లారు. దానికితోడు, పార్టీ ధిక్కారమవుతుందని చెప్పినా కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు బేఖాతరు చేసి హైదరాబాదులో సమావేశమయ్యారు. పరిస్థితి దాదాపుగా కాంగ్రెసు అధిష్టానం చేయి దాటిపోయినట్లే కనిపిస్తోంది.