సూరి హత్య కేసులో యువనేత హస్తం: ఎబిఎన్ చానెల్ వార్తాకథనం
సూరి హత్య కేసులో తన పాత్ర ఉందనే విషయంపై ఎవరిని అడిగి వార్తాకథనం ప్రసారం చేశారని ఆయన అడిగారు. తనకు ఇద్దరు ఎస్కార్టులుండగా ఎలా అజ్ఞాతంలోకి వెళ్తానని ఆయన అన్నారు. మీరు అజ్ఞాతంలోకి వెళ్లారని అనలేదని, బెంగళూర్ వెళ్లి వచ్చారని మాత్రమే చెప్పామని ఎబిఎన్ చానెల్ ప్రతినిధి చెప్పారు. తమ వద్ద పూర్తి ఆధారాలున్నాయి కాబట్టే వార్తాకథనాన్ని ప్రసారం చేశారని చెప్పారు. దాంతో సంతృప్తి చెందని మంగలి కృష్ణ చానెల్పై తీవ్రంగా మండిపడ్డారు.
సూరి హత్య కేవలం ఆర్థిక వ్యవహారాలకు సంబంధించింది మాత్రమే కాదని, అది రాజకీయ హత్య అని ఎబిఎన్ చానెల్ వ్యాఖ్యానించింది. సూరి రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని అనుకున్నారని, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి వర్గంలో చేరాలని నిర్ణయించుకున్నాడని చెప్పింది. పరిటాల రవి హత్య కేసులో సూరి కేవలం పాత్రధారి మాత్రమేనని, సూత్రధారులు వేరే ఉన్నారని, పరిటాల రవి హత్య కేసు విచారణ ముగింపు దశలో ఉందని, ఈ స్థితిలో సూరి అప్రూవర్గా మారేందుకు అవకాశాలున్నాయని, సూరి అప్రూవర్గా మారితే పరిటాల రవి హత్య వెనక సూత్రధారులు బయటపడతారని, దీంతోనే భాను కిరణ్ను వాడుకుని సూరిని హత్య చేయించారని ఎబిఎన్ చానెల్ వివరించింది.
పరిటాల రవి హత్య కేసులో మెజిస్ట్రేట్ను బదిలీ చేయించారని, ఇందుకు డబ్బులు కూడా చేతులు మారాయని ఆరోపించింది. సూరి నుంచి ఉన్న ముప్పును గమనించే సూత్రధారులు భాను చేత సూరిని హత్య చేయించారని ఆరోపించింది. ఈ వ్యవహారమంతటిలో సూరి అనుచరుడు మంగలి కృష్ణ యువనేతతో చేరాడని వ్యాఖ్యానించింది. ఈ వార్తాకథనం ప్రసారమైన వెంటనే మంగలి కృష్ణ ఫోన్లైన్లోకి వచ్చి తీవ్రంగా మండిపడ్డారు.