కేంద్రంపై తెలంగాణ ఒత్తిడి: జైపాల్ రెడ్డిపై భారం వేసిన ఎంపీలు
జైపాల్ రెడ్డిని కలిసిన అనంతరం మందా జగన్నాథం ఓ టీవీ ఛానల్ కార్యక్రమంలో మాట్లాడారు. జైపాల్రెడ్డి కేంద్రమంత్రి కాబట్టి నిన్న సమావేశానికి రాలేదని, ఆయనకు మేం వెళ్లి అన్ని వివరించామని చెప్పారు. అధిష్టానం తెలంగాణ విషయంలో చేస్తాం చూస్తాం అని నాన్చుడు ధోరణి ప్రదర్శించడం లేదన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీతో మాట్లాడిన తర్వాత కీలక నిర్ణయం ఉంటుందని చెప్పారన్నారు. శ్రీకృష్ణ కమిటీ సభ్యులు దుబాయ్లోని ఓ హోటల్లో లంచాలు తీసుకున్నట్టు వార్తలు వచ్చాయని, దానిపై వారు న్యాయపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు దుగ్గల్ చెప్పినట్లు చెప్పారు.
శ్రీకృష్ణ కమిటీ పూర్తిగా తప్పుల తడకగా ఉందన్నారు. తెలంగాణలో ఉన్నవి సీమాంధ్రలో ఉన్నట్టు, సీమాంధ్రల ఉన్నవి తెలంగాణలో ఉన్నట్టు చూపించారన్నారు. సింగరేణి ఆంధ్రప్రాంతంలో ఉన్నట్టు పేర్కొన్నరన్నారు. నివేదికలో రాజ్యాంగబద్ద రక్షణ అంటూ ఆప్షన్ ఇచ్చారని ఇన్నాళ్లు జరిగింది అదేనని అయితే అది అన్యాయం చేసింది కాబట్టే తెలంగాణ ఉద్యమం చెలరేగిందన్నారు. నివేదికతో సంబంధం లేకుండా తెలంగాణ ఇవ్వాలని మేం ప్రణబ్ను కోరామని చెప్పారు. తమకు తెలంగాణ తప్ప మరేది వద్దని ఖచ్చితంగా చెప్పామన్నారు. ఈ విషయంపై చర్చించి మళ్లీ పిలుస్తామని చెప్పారని అన్నారు. వచ్చే పార్లమెంటులో బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టాలని మేం కోరామని చెప్పారు.