తెలుగుదేశం తెలంగాణ నేతల మధ్య అనైక్యతే చంద్రబాబు వరం
చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతానికి విసుగు చెందిన నిజామాబాద్ జిల్లాకు చెందిన పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. ఇలా ఒక్కరొక్కరు పార్టీని వీడిపోయినా చంద్రబాబు పెద్ద పట్టించుకోరనే విషయం అనుభవంలో ఉన్నదే.
కాగా, తెలంగాణకు అనుకూలంగా లేని టి. దేవేందర్ గౌడ్, తలసాని శ్రీనివాస యాదవ్ వంటి నాయకులతో చంద్రబాబు తెలంగాణ వ్యవహారాలను నడపాలని అనుకుంటున్నారు. పార్టీలో తెలంగాణ నాయకుల మధ్య తెలంగాణపై ఏకాభిప్రాయం లేదని తెలుగుదేశం పార్టీ వరంగల్ జిల్లా నాయకుడు రేవూరి ప్రకాష్ రెడ్డి శనివారం అన్నారు.
ఈ ఏకాభిప్రాయం లేకపోవడాన్నే చంద్రబాబు ఆయుధంగా ఎంచుకున్నారని చెప్పవచ్చు. తెలంగాణవాదాన్ని గట్టిగా వినిపిస్తున్న నాయకులకు రేవంత్ రెడ్డి, దేవేందర్ గౌడ్ వంటి నాయకులను పోటీకి దించుతున్నారు. ఒక రకంగా తెలంగాణ నేతల మధ్య విభేదాలను చంద్రబాబే పెంచి పోషిస్తున్నారని చెప్పవచ్చు.