ముగ్గురు భార్యల ముద్దుల ఎన్నారై: ఇంటి ముందు రెండో భార్య ధర్నా
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన సుగుణకు అమెరికాలో ఉంటున్న తాడిపత్రికి చెందిన వెంకటేశ్వరరావుతో 2001లో వివాహం జరిగింది. సుగుణ తల్లిదండ్రులు కట్నంగా 10 లక్షల రూపాయలను కూడా ముట్టజెప్పారు. పెళ్లి తర్వాత సుగుణను భర్త అమెరికాకు తీసుకు వెళ్లాడు. అయితే అమెరికాకు వెళ్లిన తర్వాత గానీ సుగుణకు వెంకటేశ్వరరావు గురించి అసలు విషయం బోధపడింది. ఆయన అప్పటికే లక్ష్మీ అనే ఆమెను తనకంటే వివాహం చేసుకున్నట్టుగా తెలిసింది. మొదటి భార్యకు పిల్లలు కూడా ఉన్నారు.
అయినప్పటికీ ఆమె సర్దుకొని ఉండి పోయింది. అయితే 2008వ సంవత్సరంలో ఓ పాప పుట్టిన తర్వాత వెంకటేశ్వరరావు సుగుణను భారత్కు పంపించారు. అయితే ఆ తర్వాత ఇప్పటి వరకు సుగుణను తీసుకు వెళ్లలేదు. ఇటీవల అమెరికానుండి వెంకటేశ్వరరావు తిరిగి వచ్చాడు. అనంతరం మరో పెళ్లి కూడా చేసుకున్నట్టు కూడా తెలుస్తోంది. ఏలేశ్వరంకు చెందిన ఓ మహిళను మూడో భార్యగా చేసుకునేందుకు సిద్ధపడ్డట్లుగా తెలుస్తోంది. దీంతో సుగుణ భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయాల్సిందిగా ఆమె డిమాండ్ చేస్తోంది. తనకు అన్యాయం చేసిన వెంకటేశ్వరరావును కఠినంగా శిక్షించాలని కోరుతోంది.