మంత్రివర్గ సమావేశం: కె జానా రెడ్డి వర్సెస్ శ్రీధర్ బాబు
కౌలుదరీ చట్టంపై మెజారిటీ ప్రకారమే నిర్ణయం తీసుకోవాలని శ్రీధర్ బాబు అన్నారు. మెజారిటీ అంటే గ్రూపులు తెస్తారా అని జానా రెడ్డి ఆగ్రహంగా అన్నట్లు తెలుస్తోంది. గంటకు పైగా కౌలుదారీ చట్టంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కౌలుదారీ చట్టంపై హామీ ఇచ్చాం కాబట్టి తేవడం మంచిదని దానం నాగేందర్ అన్నట్లు తెలుస్తోంది. హైదరాబాదుకు చెందిన దానం నాగేందర్కు దాని గురించి తెలియదని బొత్స సత్యనారాయణ అన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద, కౌలుదారీ చట్టంపై మంత్రి వర్గం సమావేశంలో తీవ్ర రగడ జరిగినట్లు సమాచారం.
కాగా, కోనేరు రంగారావు కమిటీ సూచనల మేరకు చెంచుల భూముల బదలాయింపును నిషేధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థలను లోకాయుక్త పరిధిలోకి తేవాలని కూడా మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. కంచి పీఠానికి గత ప్రభుత్వం ఇచ్చిన 60 ఎకరాల భూమిపై కూడా చర్చ జరిగింది. ఆ భూమిని ఎవరు కేటాయించారో తనకు తెలియదని మంత్రి గల్లా అరుణ కుమారి అన్నారు. దాన్ని సమీక్షించాలని రెవెన్యూ మంత్రి ఆనం నారాయణ రెడ్డి సూచించారు.
దాంతో రెవెన్యూ మంత్రి అధ్యక్షతన ఓ కమిటీ వేయాలని నిర్ణయించారు. శాసనసభ్యుల కోటా కింద జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో చాకచక్యంగా వ్యవహరించారని మంత్రులు ముఖ్యమంత్రిని అభినందించినట్లు సమాచారం. క్రాస్ వోటింగ్ జరిగినా మనమే గెలిచామని ముఖ్యమంత్రి అన్నారు. ఈ నెల 23వ తేదీ రాత్రి ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లనున్నారు.