వల్లభనేని వంశీ వెనక హరికృష్ణ, నెహ్రూతో దేవినేని ఉమ ఫిక్సింగ్?
దేవినేని ఉమపై చాలా కాలంగా హరికృష్ణ అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెసు పార్టీలో తలెత్తిన విభేదాలను, వచ్చిన చీలికను కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు సరిగా ఉపయోగించుకోలేకపోయారని హరికృష్ణ భావిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న దేవినేని ఉమా మహేశ్వర రావేనని ఆయన అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. కాంగ్రెసు పార్టీలో ఉన్న తన సోదరుడు దేవినేని నెహ్రూతో ఉమ మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడ్డారని భావిస్తున్నట్లు చెబుతున్నారు.
వల్లభనేని వంశీ తరుచుగా నెహ్రూతో తగాదాలకు దిగుతున్నారు. నెహ్రూ, వంశీల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. ఈ విషయంలో ఉమ నెహ్రూకు లోపాయికారిగా మద్దతిస్తున్నారనేది వంశీ అభిప్రాయమని చెబుతున్నారు. ఇసుక కాంట్రాక్టుల విషయంలో గానీ పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న దాడుల విషయంలో గానీ ఉమ నోరెత్తకపోవడానికి అదే కారణమని అంటున్నారు. దీంతో ఉమపై విజయవాడ నగరంలో ఆధిపత్యం కోసం వంశీ ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇప్పుడు వంశీకి హరికృష్ణ మద్దతు లభించడంతో రెచ్చిపోయారని చెబుతున్నారు.