బెంగళూరు, ముంబైలాగా కాకూడదనే: తెలంగాణ రోడ్ మ్యాప్.. !!
తెలంగాణలో పెట్టుబడులపై సీఐఐ నార్త్ రీజియన్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఈ భేటీ ఏర్పాటైంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాలను ఈ సందర్భంగా ఆయన వివరించారు. అమల్లో ఉన్న పారిశ్రామిక విధానాలు, రాయితీల గురించి వారికి తెలియజేశారు. మంచి ప్రతిపాదనలతో వచ్చిన వారికి ప్రోత్సాహకాలు ఇస్తోన్నామని పేర్కొన్నారు.
30,000 ఎకరాల్లో హైదరాబాద్ శివార్లల్లో ప్రతిపాదించిన ఫ్యూచర్ సిటీలో ఫార్చ్యూన్ 500 కంపెనీల పెట్టుబడులను తీసుకుని రావాలనేదే తమ లక్ష్యమని రేవంత్ రెడ్డి తెలిపారు. గత ఏడాది డిసెంబర్లో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్లో 175 దేశాల ప్రతినిధులు పాల్గొన్న విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ రైజింగ్ 47 పాలసీని గ్లోబల్ సమ్మిట్లో ప్రకటించిన విషయాన్ని వారికి వివరించారు. జీడీపీలో తెలంగాణ వాటా అయిదు శాతంగా ఉందని, దీన్ని 10కి చేర్చేలా చర్యలు తీసుకుంటోన్నామని అన్నారు.

ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగుళూరుల్లో మౌలిక రంగాల్లో అనేక సమస్యలు ఉన్నాయని, అటువంటి పరిస్థితి ఇక్కడ తలెత్తకుండా ఉండటానికి క్యూర్, ప్యూర్, రేర్గా విభజించామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఔటర్ రింగు రోడ్డు లోపల క్యూర్ ప్రాంతాన్ని సర్వీస్ సెక్టర్గా గుర్తించామని వివరించారు. ఔటర్ రింగు రోడ్డు నుంచి రీజినల్ రింగ్ రోడ్డు వరకు ప్రాంతాన్ని ప్యూర్గా నిర్ధారించామని, అక్కడ మాన్యుఫ్యాక్చర్ రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. రీజినల్ రింగు రోడ్డు వెలుపల వ్యవసాయ రంగానికి, అగ్రి పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
ప్యూర్, రేర్ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములు ఇవ్వడంతో పాటు ఇతర వసతులు కల్పిస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం పోర్టు వరకు 12 లేన్ల రహదారి నిర్మించనున్నామని, విభాగాల వారీగా క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. వరంగల్, ఆదిలాబాద్లో ఎయిర్ పోర్టుల నిర్మాణాలకు కేంద్రం నుంచి అనుమతి తెలిపిందని, ఏడు బుల్లెట్ ట్రైన్లను కేంద్రం ప్రకటిస్తే అందులో మూడు తెలంగాణకు వచ్చాయని అన్నారు.
శంషాబాద్ నుంచి చెన్నై, శంషాబాద్ నుంచి పూణె, శంషాబాద్ నుంచి బెంగళూరు బుల్లెట్ ట్రైన్లు రాబోతున్నాయని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. పొరుగు రాష్ట్రాలతో పోటీ పడదల్చుకోలేదని, ప్రపంచంలోని ఇతర దేశాలతో పోటీ పడి చైనా ప్లస్ వన్ కంట్రీగా తెలంగాణను తీర్చిదిద్దడం, 2037 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిలపడం తమ లక్ష్యమని తెలిపారు.












Click it and Unblock the Notifications