ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యలు?
రాయలసీమలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణవాసులు దురభిప్రాయంతో ఉన్నారని ముఖ్యమంత్రి ఎన్. కిరణ్కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. నిజానికి తెలంగాణకన్నా రాయలసీమ వెనుకబడి ఉందని ఆయన అన్నారు. కరీంనగర్ జిల్లాలో మొత్తం 12 లక్షల ఎకరాల ఆయకట్టు అభివృద్ధి చేయాల్సి ఉండగా అప్పటికే చేపట్టిన ప్రాజెక్టుల ద్వారా ఎనిమిది లక్షల ఎకరాలకు పైగా నీరందుతోందని, అయితే తమతో మాట్లాడిన తెలంగాణవాసులు మాత్రం రాయలసీమకు సాగునీటి ప్రాజెక్టులు తరలించుకు వెళ్తున్నారని చెప్పారని ఆయన వివరించారు.
సీఎం కిరణ్ పర్యటనలో చిత్తూరు ఎమ్మెల్యే సీకే బాబు మరోసారి అలగడం చర్చనీయాంశమైంది. పీవీకేఎన్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద సీఎంకు స్వాగతం పలికేందుకు వచ్చిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హెలిప్యాడ్ లోపలికి సీకే అనుచరులను సెక్యూరిటీ సిబ్బంది అనుమతించలేదు. ఆగ్రహించిన సీకే వారితో వాగ్వివాదానికి దిగారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని సెక్యూరిటీ తేల్చి చెప్పడంతో సీఎం వచ్చిన మరుక్షణమే సీకే బాబు అక్కడినుంచి వెళ్ళిపోయారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి జోక్యంతో శతాబ్ది వేడుకలు జరుగుతున్న మైదానానికి హాజరైనప్పటికీ వేదికపైకి వెళ్ళలేదు.