సత్య సాయిబాబా క్షేమంగా ఉన్నారు: ట్రస్టు మెడికల్ బులిటెన్
పుట్టపర్తి సత్య సాయిబాబా కన్ను మూసినట్లు అంతకు ముందు పుకార్లు గుప్పుమన్నాయి. అయితే, ఈ పుకార్లను సత్యసాయి ట్రస్టు సభ్యులు ఖండించారు. సత్యసాయిబాబా సూపర్ ఆస్పత్రిలోని ఐసియులో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. సత్య సాయిబాబా ఉగాది పండుగ రోజు భక్తులకు దర్సనమిస్తారని వారు చెప్పారు. సత్య సాయిబాబా ఆరోగ్యం బాగు పడాలని భక్తులు పూజలు చేస్తున్నారు.
పుట్టపర్తి సత్య సాయిబాబా ఆరోగ్యం మళ్లీ క్షీణించిందనే వదంతులు శనివారం ఉదయం గుప్పుమన్నాయి. ఆరోగ్యం క్షీణించడంతో ఆయన పుట్టపర్తిలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో వారం రోజులుగా చికిత్స పొందుతున్నారు. పుట్టపర్తిలో డిజిపి అరవింద్ రావు ఏర్పాటు చేసిన సమావేశం నుంచి డిఐజి చారు సిన్హా అకస్మాత్తుగా వెళ్లిపోయారు. దీంతో ఆ వదంతులు మరింతగా వ్యాపించాయి. పుట్టపర్తి సత్యసాయిబాబా ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం అందడం వల్ల డిజిపి సమావేశం నుంచి హఠాత్తుగా చారు సిన్హా బయలుదేరి వెళ్లారని అంటున్నారు.