ఉత్తర భారతదేశంలో భూకంపం: వణికిపోయి పరుగులు తీసిన ప్రజలు
ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూకాశ్మీర్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, హిమాచల్ప్రదేశ్ల్లో భూకంపం కనిపించింది. ఢిల్లీలోని నోయిడా, గుర్గావ్ ప్రాంతాల్లో బలమైన ప్రకంపనలు వచ్చాయని స్థానికులు తెలిపారు. ఇళ్లలోని ఫర్నీచర్ కంపించాయని చెప్పారు. భూకంప ప్రభావం యూపీలోని పశ్చిమ, టెర్రాయ్ ప్రాంతంలో కనిపించింది. గౌతమబుద్ధ్ నగర్ (నోయిడా), ఘజియాబాద్, రామ్పూర్, లఖింపూర్ ఖేరి, మీరట్, మొరాదాబాద్ సహా పలు జిల్లాల్లో ప్రకంపనలు వచ్చాయి. ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్, నైనిటాల్, రాజస్థాన్లోని జైపూర్ తదితర ప్రాంతాల్లో భూమి కంపించింది.
ఇండొనేషియాలోనూ సోమవారం తెల్లవారుజామున 3.06గంటలకు ఒక మోస్తరు స్థాయి భూకంపం వచ్చింది. భూకంప తీవ్రతను అమెరికా భూగర్భశాస్త్రవేత్తలు 6.7గా నిర్ధరించగా.. ఇండొనేషియా అధికారులు మాత్రం 7.1గా పేర్కొన్నారు. జావా తీరానికి 277 కిలోమీటర్ల దూరంలో హిందూ మహాసముద్రంలో 24 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉందని అమెరికా భూగర్భ సర్వే సంస్థ పేర్కొంది. దీనివల్ల సునామీ వచ్చే ప్రమాదం ఉందని తొలుత ఇండొనేషియా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.