చిరంజీవి పిఆర్పీ విలీనం నిర్ణయం పవన్ కల్యాణ్కు తెలియదా?
శోభారాణి వ్యాఖ్యల ద్వారా విలీనం నిర్ణయం తమ్ముళ్లకు చెప్పకుండానే జరిగిందని తెలుస్తోంది. కేవలం బావమరిది అల్లు అరవింద్ నిర్ణయం ప్రకారం తనకు దగ్గరగా ఉన్న సి.రామచంద్రయ్య తదితరులకు మాత్రమే చెప్పి అంతిమ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వెంట వెళుతున్న పిఆర్పీ ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, కాటసాని రాంరెడ్డిలపై వేటుకు కూడా పార్టీ సిద్ధ పడక పోవడానికి కారణం విలీనం విషయం వారికి తెలియక పోవడమే అని తెలుస్తోంది. విలీనాన్ని వ్యతిరేకిస్తూ వాసిరెడ్డి పద్మ కూడా ఇప్పటికే జగన్ పంచన చేరారు.
ముఖ్యంగా పవన్ కల్యాణ్ గత కొన్నాళ్లుగా బయటకు రాక పోవడానికి కారణం కూడా విలీనంపై ఆయనకు తెలియక పోవడమే అని శోభారాణి వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది. ప్రజారాజ్యం పార్టీ అనుకున్నన్ని సీట్లు గెలవనప్పటికీ ముందు ముందు మంచి భవిష్యత్తు ఉంటుందన్న అభిప్రాయం పవన్లో ఉందని, అందుకే ఆయనకు విలీనం ఇష్టం లేదనే వాదనలు వినిపించాయి. అందుకే అన్న పార్టీ కోసం అహర్నిషలు శ్రమించిన తమ్ముళ్లు నాగబాబు, పవన్లు ప్రస్తుతానికి చిరంజీవికి దూరంగా ఉన్నట్టుగా కనిపిస్తున్నారు.