3జీ స్మార్ట్ఫోన్ ఉందంటే జేబులో ఒక చిన్న ల్యాప్టాప్ ఉన్నట్లే...

మొబైల్ ఫోన్లోనే ఇష్టమైన పాటలను సెకన్లలో డౌన్లోడ్ చేసుకోవడం, మెరుపు వేగంతో ఇంటర్నెట్ సర్ఫింగ్, ైలైవ్టీవీ కార్యక్రమాలను ఎలాంటి బఫరింగ్ లేకుండా చూడగలగడం. జీపీఎస్ రూటు మ్యాపింగ్ ద్వారా తెలియని అడ్రసుల్ని చేరడం ఇలాంటి ఫీచర్లన్నీ 3జీ టెక్నాలజీతోనే సాధ్యం. ఎలాగంటారా.. ప్రస్తుత రెండో తరం టెక్నాలజీతో నడిచే 2జీ నెట్వర్క్లలో డేటా ట్రాన్స్ఫర్ వేగం 144 కేబీపీఎస్ దాకా మాత్రమే ఉంటోంది. అంటే ఓ మూడు నిమిషాల పాటల ఫైలును డౌన్లోడ్ చేసుకోవాలంటే సగటున ఎనిమిది నిమిషాలు పట్టేస్తుంది. అదే 3జీలో.. డేటా ట్రాన్స్ఫర్ మెరుపువేగంతో జరిగిపోతుంది. ఈ నెట్వర్క్లో వేగం 2 ఎంబీపీఎస్ దాకా ఉంటుంది. అంటే అదే మూడు నిమిషాల ఒక పాటను 15 సెకన్ల వ్యవధిలోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. చేతిలో ఒక 3జీ స్మార్ట్ఫోన్ ఉందంటే జేబులో ఒక చిన్న ల్యాప్టాప్ ఉన్నట్లే.
3జీ స్మార్ట్ ఫోన్లు..
ఈ 3జీ సర్వీసులు అందుకోవాలంటే మామూలు ఫోన్లు పనిచేయవు. ఇందుకోసం ప్రత్యేకంగా 3జీ టెక్నాలజీ సపోర్టు చేసే ఫోన్లు అవసరమవుతాయి. ప్రారంభంలో వీటి రేట్లు భారీగానే ఉన్నా.. కంపెనీలు ఇప్పుడు అందుబాటు ధరల్లో కూడా అందించడం మొదలెట్టాయి. ఇవి నాలుగైదు వేల నుంచీ మొదలై, రూ.40,000 పైదాకా కూడా ఉన్నాయి. 2013 కల్లా 39.5 కోట్ల 3జీ హ్యాండ్సెట్లు అమ్ముడవుతాయని ఈవాల్యూసర్వ్ అనే కన్సల్టెన్సీ నివేదికలో వెల్లడైంది.
3జీ డేటా కార్డులు...
ల్యాండ్లైన్తో సంబంధం లేకుండా ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించేవే ఈ డాటాకార్డులు. పెన్డ్రైవ్ సైజులో ఉండే ఈ వైర్లెస్ డేటా కార్డులను జేబులో పెట్టుకుని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. ఏ ల్యాప్టాప్, డెస్క్టాప్ కైనా కనెక్ట్ చేసుకుని ఇంటర్నెట్ సౌకర్యం పొందొచ్చు. త్రీజీ డాటా కార్డులు సిమ్ ఆధారంగా పనిచేసేవి కావడంతో ఫోన్ సిగ్నల్స్ అందే ఏ ప్రాంతంలోనైనా హైస్పీడ్ ఇంటర్నెట్ను అందిస్తాయి.
త్రీజీ సర్వీసులు ప్రారంభించిన జీఎస్ఎం టెలికాం ఆపరేటర్లంతా ఈ వైర్లెస్ ఇంటర్నెట్ వ్యాపారంలోకి వేగంగా దూసుకురావడంతో కొత్త పోటీ మొదలైంది. త్రీజీ డేటా కార్డులు తక్కువ ధరకు లభించడమే కాక అత్యంత వేగమైన ఇంటర్నెట్ స్పీడును అందిస్తాయి. ప్రస్తుతం 3.2 ఎంబీపీఎస్ నుంచి 21ఎంబీపీఎస్ వరకు స్పీడు గల డేటా కార్డులు అందుబాటులో ఉన్నాయి. వీటి టారిఫ్లను కూడా కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా నిర్ణయించడంతో డేటా కార్డుల్ని జనం క్రేజీగా కొంటున్నారు. ఇటీవల డేటా కార్డుల వినియోగం భారీగా పెరిగిందని 3జీ రాకతో ఇక అనూహ్య మార్పులు వస్తాయని ఎయిర్సెల్ ఏపీ సర్కిల్ బిజినెస్ హెడ్ మూర్తి చాగంటి చెప్పారు. దేశంలో నెలకు దాదాపు 3 లక్షల డేటాకార్డులు అమ్ముడవుతున్నాయి. టెలికాం అపరేటర్లు డాటా కార్డు సర్వీసుల ద్వారా 10% పైగా ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు.
టారిఫ్లతో జాగ్రత్త
మొబైల్ టెలికాం ఆపరేటర్ల మధ్య జరిగిన టారిఫ్ పోటీ.. కాల్స్రేట్లను సెకనుకు అరపైసా స్థాయికి కూడా తగ్గించేసింది. కానీ, 3జీ సర్వీసుల విషయంలో మాత్రం కంపెనీలు కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. 3జీ లెసైన్సుల కోసం, స్పెక్ట్రమ్ కేటాయింపులకు కోట్ల రూపాయలు వెచ్చించాల్సి రావడంతో ఆ భారాన్ని కొంత కస్టమర్లకు కూడా బదలాయిస్తున్నాయి. అయితే వినూత్న ప్యాకేజీలు,ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. వీడియో కాలింగ్, డేటా డౌన్లోడింగ్కోసం ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటిస్తున్నాయి.
3జీ అని సింపుల్గా పిల్చుకునే మూడో తరం (థర్డ్ జనరేషన్) టెక్నాలజీ టెలికాం సర్వీసులు విదేశాల్లో ఎప్పట్నుంచో ఉన్నా మన దగ్గర మాత్రం ఇప్పుడే ప్రారంభమయ్యాయి. ఈ 3జీ సర్వీసులు వచ్చే రెండేళ్లలో మరింత ఊపందుకోనున్నాయి. 2013 నాటికల్లా మొత్తం పట్టణ ప్రాంత కస్టమర్లలో 50% మంది 3జీ వైపే మొగ్గుచూపుతారని అంచనా. వచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా 20 కోట్ల మంది ఈ సర్వీసులు పొందుతారని పరిశీలకులు భావిస్తున్నారు. 2012 కల్లా 2,50,000 గ్రామాలను వైర్లెస్ బ్రాడ్బ్యాండ్, 3జీ మొబైల్ సర్వీసులతో అనుసంధానించాలని టెలికాం శాఖ నిర్దేశించుకుంది. దీంతో 3జీ టెలికాం సర్వీసులు అందించేందుకు టెలికాం కంపెనీలు పోటీపడుతున్నాయి. 3జీ స్పెక్ట్రం వేలం ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.67,718 కోట్లు రావడమే వీటిపై ఉన్న క్రేజుకు నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ సర్కిల్స్లో 3జీ లెసైన్సులు బీఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, ఎయిర్సెల్, ఐడియా దక్కించుకున్నాయి.
ప్రీపెయిడ్, పోస్ట్పెయిడ్లలో లభించే 3జీ సర్వీసుల్ని ఆపరేటర్లు వివిధ ప్యాకేజీలుగా అందిస్తున్నారు. నెలవారీగా నిర్ణీత రుసుము చెల్లిస్తే కొంత వరకు డేటాను ఉచితంగా డౌన్లోడ్ చేసుకునే వెసులు బాటు కల్పిస్తున్నారు. ఉచితంగా అందించే డేటా లిమిట్ను దాటితే మాత్రం బిల్లులు భారీగా వస్తాయి.












Click it and Unblock the Notifications