కడప కింగ్ వైయస్ జగన్, ఐదు లక్షలకు పైగా మెజారిటీతో విజయం

అయితే, జగన్ మాజీ ప్రధాని పివి నరసింహారావు రికార్డును మాత్రం బద్దలు కొట్టలేకపోయారు. ప్రధానిగా ఉన్న సమయంలో కర్నూలు జిల్లా నంద్యాల నుంచి పోటీ చేసిన పివి నరసింహా రావుకు 5 లక్షల 70 వేల పైచిలుకు మెజారిటీ లభించింది. కడప లోకసభ నియోజకవర్గం పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా వైయస్ జగన్ తిరుగు లేని ఆధిక్యతను ప్రదర్శించారు. మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మైదుకూరు శాసనసభ స్థానంలో వైయస్ జగన్కు 60 వేలకు పైబడి మెజారిటీ లభించింది. డిఎల్ రవీంద్రా రెడ్డి స్వగ్రామం సుంకేశులలో జగన్కు పది వేల మెజారిటీ లభించింది.
కాగా, పులివెందుల శాసనసభా స్థానంలో వైయస్ విజయమ్మ కన్నా వైయస్ జగన్కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. తన తల్లి వైయస్ విజయమ్మకు వచ్చిన మెజారిటీ కన్నా దాదాపు 20 వేల ఓట్ల జగన్కు ఎక్కువ ఎక్కువ మెజారిటీ లభించింది. విజయమ్మకు పులివెందుల శాసనసభా నియోజక వర్గంలో 85,191 ఓట్ల మెజారిటీ రాగా, వైయస్ జగన్కు తన ప్రత్యర్థులపై లక్షా 8వే 133 ఓట్ల మెజారిటీ లభించింది. వైయస్ విజయమ్మపై వైయస్ వివేకానంద రెడ్డి పోటీ చేయడంతో వైయస్ విజయమ్మ మెజారిటీ తగ్గిందని భావించవచ్చు. పార్లమెంటు సీటుకు వచ్చే సరికి వైయస్ వివేకానంద రెడ్డికి పడిన ఓట్లు చాలా వరకు జగన్కు పడినట్లు చెప్పవచ్చు. ఈ విజయంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications