సిఎం కిరణ్ కుమార్ రెడ్డిని మారుస్తారా, రేసులో పురంధేశ్వరి, బొత్స?

కిరణ్ కుమార్ రెడ్డిపై మిగతా శాసనసభ్యులు కూడా అంత సంతృప్తిగా లేరని తెలుస్తోంది. బొత్స సత్యనారాయణ వంటి మంత్రులు కూడా లోలోన రగిలిపోతున్నారు. పార్టీ వ్యవహారాలను, ప్రభుత్వ తీరును పరిశీలించడానికి వచ్చిన గులాం నబీ ఆజాద్ భేటీలకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ను దూరంగా ఉంచారు. ఇప్పటి వరకు వారిద్దరు అందిస్తున్న సమాచారమే పార్టీ అధిష్టానం వద్ద ఉంది. ఇప్పుడు స్వయంగా పరిస్థితిని అంచనా వేసేందుకు సిద్ధపడిన ఆజాద్ వారిద్దరిని భేటీలకు దూరం ఉంచినట్లు చెబుతున్నారు. వారు లేకపోతే శాసనసభ్యులు, నాయకులు స్వేచ్ఛగా అభిప్రాయాలు వెల్లడిస్తారని భావించే ఆ రకంగా చేశారని అంటున్నారు.
ముఖ్యమంత్రి పదవి కోసం కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి, బొత్స సత్యనారాయణ పోటీ పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కిరణ్ కుమార్ రెడ్డి శాసనసభ్యులను పట్టించుకోవడం లేదని, అధికారులకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారని శాసనసభ్యులు అంటున్నారు. శాసనసభ్యులను, పార్టీ నాయకులను విశ్వసనీయతలోకి తీసుకోకపోవడం వల్ల కడప ఉప ఎన్నిక ఫలితం అలా వచ్చిందని భావిస్తున్నారు. కడప ఉప ఎన్నిక ఫలితం ప్రభావం కిరణ్ కుమార్ రెడ్డిపై పడినట్లు చెబుతున్నారు. అయితే, ఇటీవలే కాంగ్రెసు అధిష్టానం ముఖ్యమంత్రిని మార్చింది. మళ్లీ అందుకు సిద్ధపడుతుందా అనేది సందేహమే. కిరణ్ కుమార్ రెడ్డినే కొనసాగిస్తూ వ్యవహారాలను చక్కదిద్దాలనేది కాంగ్రెసు వ్యూహంగా చెబుతున్నారు.












Click it and Unblock the Notifications