చంద్రబాబుపై ఫైర్: తిరుగుబాటుకు నాగం జనార్దన్ రెడ్డి వర్గం రెడీ
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా లేఖ రాయకుంటే పార్టీతో అమీతుమీకి సిద్ధంగా ఉన్నట్లు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నహెచ్చరించారు. ఈ నెల 25న కరీంనగర్ లో జరిగే తెలంగాణ సమావేశానికి గౌర్హాజరవుతామని చెప్పారు. మహానాడులో తెలంగాణ తీర్మానం చేస్తూ అమరవీరులకు సంతాపం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ లో జూన్ మొదటి వారంలో తెలుగుదేశం పార్టీ జెండా, చంద్రబాబు నాయుడు ఫొటో లేకుండా తెలంగాణ నగారా నిర్వహిస్తామని ఆయన చెప్పారు. నాగం జనార్ధన రెడ్డే తమ నాయకుడని ఆయన స్సష్టం చేశారు.
నాగం జనార్దన్ రెడ్డిని ఎదుర్కోవడానికి ఈ నెల 25వ తేదీన ఎర్రబెల్లి వర్గం తెలంగాణ సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సమావేశానికి ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురయ్యే వాతావరణం కూడా ఉంది. చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరించే ఈ వర్గానికి తిప్పలు తప్పవనేది నిజం. పైగా, ఎర్రబెల్లి దయాకర్ రావు వర్గంలోనూ విభేదాలు ఉన్నాయి. భువనగిరి శాసనసభ్యురాలు ఉమా మాధవ రెడ్డికి, నల్లగొండ జిల్లాకే చెందిన మరో శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులుకు పడదు. చంద్రబాబుకు అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తున్న శానససభ్యుల్లో మరింత మంది నాగం జనార్దన్ రెడ్డి వైపు వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.
చంద్రబాబు తెలంగాణ వైఖరిని రంగారెడ్డి జిల్లా పరిగి శాసనసభ్యుడు హరీశ్వర్ రెడ్డి కూడా తప్పు పట్టారు. నాగం జనార్దన్ రెడ్డిపై చర్యలు తీసుకుంటే ప్రజలపై చర్యలు తీసుకున్నట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వేణుగోపాలాచారి కూడా నాగం జనార్దన్ రెడ్డి వర్గంలోనే ఉంటారని తెలుస్తోంది. తెలంగాణ పట్ల నిబద్ధత నాగం జనార్దన్ రెడ్డి వర్గానికే ఉందనే అభిప్రాయం ప్రజల నుంచి బలంగా వ్యక్తమయ్యే అవకాశాలున్నాయి. దీని ఆధారంగానే నాగం జనార్దన్ రెడ్డి వర్గం ముందుకు సాగుతోంది.