నాగం జనార్దన్ రెడ్డిపై వేటుకు తెలుగుదేశం రంగం సిద్ధం
పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రైతు సమస్యలపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్తో చర్చించేందుకు రేపు మంగళవారం ఢిల్లీ వెళ్తున్నారు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత రేపు సాయంత్రం గానీ, ఎల్లుండి బుధవారం ఉదయం గానీ పార్టీ పోలిట్బ్యూరో సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశంలో నాగం జనార్దన్ రెడ్డిపై తీసుకునే చర్యలపై నిర్ణయం జరుగుతుందని అంటున్నారు. నాగం జనార్దన్ రెడ్డికి షోకాజ్ నోటీసు ఇస్తారా, ఏకంగా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా అనేది తెలియడం లేదు.
ఈ నెల 27, 28 తేదీల్లో పార్టీ మాహానాడు జరగనుంది. మహానాడుకు ముందు నాగం జనార్దన్ రెడ్డిపై చర్యలు తీసుకుంటారా, తర్వాత తీసుకుంటారా అనేది కూడా స్పష్టంగా తెలియడం లేదు. సోమవారం నాడు మరో తెలంగాణ ప్రాంత శానససభ్యుడు హరీశ్వర్ రెడ్డి తెలంగాణపై పార్టీ వైఖరిని తప్పు పడుతూ పార్టీ తెలంగాణ ఫోరానికి బహిరంగ లేఖ రాశారు. అయితే, హరీశ్వర్ రెడ్డిపై ప్రస్తుతానికి చర్యలు ఉండకపోవచ్చునని అంటున్నారు.