ప్రభుత్వం పడిపోతుందా, లేదా చెప్పలేను: అవిశ్వాసంపై చంద్రబాబు
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాజకీయాలను భ్రష్టు పట్టిస్తోందని ఆయన అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెసు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన అన్నారు. రైతు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయడం లేదని ఆయన విమర్శించారు. కాంగ్రెసు పాలనలో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి పోయిందని ఆయన అన్నారు. తమ పాలన తెలంగాణకు స్వర్ణయుగమని ఆయన అన్నారు. తాము ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తున్నామని, దొడ్డి దారిన అధికారంలోకి రావాలని తమకు లేదని, ప్రజలు కోరుకున్నప్పుడు తాము వస్తామని ఆయన అన్నారు.
తెలంగాణపై ప్రజలకు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోం మంత్రి చిదంబరం తీసుకుంటామని అన్నారని, తీసుకోమనండి అని ఆయన మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా అన్నారు. ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని, ఇటువంటి స్థితిలోనే తాము అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తున్నామని ఆయన చెప్పారు. ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని, తాము రైతు సమస్యలపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తున్నామని ఆయన అన్నారు.
అవినీతితో దేశాభివృద్ధికి ముప్పు ఏర్పడిందని ఆయన అన్నారు. యుపిఎ పాలన అవినీతిమయంగా మారిందని ఆయన విమర్శించారు. అవినీతి కార్యకలాపాలన్నింటికీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రధాన సాక్షి అని ఆయన వ్యాఖ్యానించారు. అవినీతికి వ్యతిరేకంగా యోగా గురు రాందేవ్ బాబా చేస్తున్న దీక్షకు తాము మద్దతు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. నల్లధనం వెలికితీత విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు.