జగన్ వెంట మిగిలింది 14 మంది ఎమ్మెల్యేలే?
అత్యవసరంగా సమాచారం అందించడం వల్ల దూరంగా ఉండడంతో మిగతావారు రాలేకపోయారని అంటున్నారు. ఇందులో కొంత నిజం లేకపోలేదు. హైదరాబాదులో అందుబాటులో ఉన్నవారు మాత్రమే సమావేశానికి హాజరయ్యారు. అవసరమైతే రాజీనామాలు చేయడానికి సిద్ధమేనని జగన్ వర్గం శాసనసభ్యులు చెప్పారు. అయితే, ఇప్పటికిప్పుడు రాజీనామా చేసే పరిస్థితి లేదని శాసనసభ్యురాలు శోభానాగిరెడ్డి మాటలను బట్టి తెలుస్తోంది. అవసరమైతే రాజీనామాలు చేస్తామని ఆమె చెప్పారు. సమావేశమైన శాసనసభ్యులతో కృష్ణా జిల్లా ఓదార్పు యాత్రలో ఉన్న వైయస్ జగన్ ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది.
వైయస్ జగన్ వర్గానికి చెందిన శానససభ్యులు రేపు శనివారం గవర్నర్ నరసింహన్ను కలుసుకుంటున్నారు. అయితే, రాజీనామా లేఖలు అందించడానికి మాత్రం కాదని అంటున్నారు. జగన్పై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని వారు విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత బస్సు యాత్ర చేపట్టే ఆలోచనలో వారున్నారు. మరింత మంది కాంగ్రెసు, తెలుగుదేశం శాసనసభ్యులను కూడగట్టి ప్రభుత్వం పడిపోయే విధంగా రాజీనామాలకు సిద్ధపడాలని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద రాజీనామాల యోచన మాత్రం వారిలో ఉంది.