జగన్ ఆస్తుల కేసు: విచారణలో వేగం పెంచిన ఈడి
ఏపీఐఐసీతో ఎమ్మార్ కుదుర్చుకున్న ఒప్పందం వివరాలనూ సేకరించారు. వీటన్నింటితోపాటు ఈడీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీధర్ రెండు మూడు దఫాలుగా సీబీఐ జాయింట్ డైరెక్టరు లక్ష్మీనారాయణతో సమావేశమయ్యారు. ఈ రెండు కేసుల్లో వెల్లడైన వివరాలను పరస్పరం పంచుకున్నారు. ఈ రెండు కేసుల తీవ్రత దృష్ట్యా ఢిల్లీ నుంచి సోమవారం నలుగురు ఉన్నతాధికారులు హైదరాబాద్ వచ్చారు. వీరిలో ఈడీ ప్రత్యేక డైరెక్టరు సహానీ, ఉప న్యాయ సలహాదారు సింగ్లతోపాటు మరో ఇద్దరు అధికారులున్నారు. ప్రాథమిక వివరాలను సమీక్షించడంతోపాటు భవిష్యత్తులో అనుసరించాల్సిన విధివిధానాల గురించి దిశానిర్దేశం చేశారు.
దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని, ప్రతి రోజూ కేసుల పురోగతిని పర్యవేక్షించాలని, నిర్దేశిత సమయంలో దర్యాప్తు పూర్తి చేయాలని సూచించారు. జగన్ అక్రమ ఆస్తుల వ్యవహారంలో మారిషస్ కంపెనీల నుంచి పెద్ద ఎత్తున నిధులు మళ్లించినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అవసరమైతే అక్కడికి దర్యాప్తు బృందాన్ని పంపే విషయంపైనా ఈ సమావేశంలో చర్చించారు. విదేశీ దర్యాప్తుపై తొందరపడాల్సిన అవసరం లేదు కాబట్టి అవసరమైనప్పుడు పంపేందుకు ఏర్పాట్లు చేసుకుని సిద్దంగా ఉండాలనే అభిప్రాయానికి వచ్చారు. ఇందుకు అవసరమైన దౌత్యపరమైన అనుమతులకు సంబంధించిన ప్రక్రియ మొదలుపెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.