నిరవధిక నిరాహార దీక్షపై వెనక్కి తగ్గిన కెసిఆర్

కాగా, పార్టీ నాయకులతో తాను దీక్ష చేపట్టబోయే విషయంపై కెసిఆర్ సుదీర్ఘంగా మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. దీక్ష వద్దని ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారని కెసిఆర్ మంగళవారం ఓ సభలో చెప్పారు. అవసరం వచ్చినప్పుడు దీక్ష చేస్తానని ఆయన అన్నారు. దీన్ని బట్టి ఇప్పటికిప్పుడు ఆయన దీక్ష చేపట్టే ఆలోచనను విరమించుకున్నట్లు అర్థమవుతోంది. పైగా, కాంగ్రెసు తెలంగాణ ప్రాంత సీనియర్ నాయకుడు కె. కేశవరావు భేటీ కూడా కెసిఆర్ ఆలోచనలో మార్పు తెచ్చినట్లు సమాచారం. దీక్ష ఇప్పుడు అవసరం లేదని కెసిఆర్కు తాను చెప్పినట్లు కేశవరావు చెప్పారు. వారిద్దరి మధ్య మరే విధమైన మంతనాలు జరిగాయనేది తెలియదు. కెసిఆర్ దీక్షకు బదులుగా అక్టోబర్ మొదటివారంలో పెద్ద యెత్తున హైదరాబాదు ముట్టడి చేపట్టాలనే ఆలోచన సాగుతోంది.
ఇదిలా వుంటే, కెసిఆర్ మంగళవారం సాయంత్రం తెలంగాణ రాజకీయ జెఎసి, ఉద్యోగ సంఘాల జెఎసి నాయకులతో సమావేశమయ్యారు. సకల జనుల సమ్మెపై, తాను చేపట్టబోయే దీక్షపై కెసిఆర్ ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. తమ సమ్మె నిరవధికంగా సాగుతుందని ఆర్టీసి కార్మికులు చెప్పారు. అలాగే, సకల జనుల సమ్మె జరిగినన్ని రోజులు తెలంగాణలో పాఠశాలలు మూసేయాలనే నిర్ణయం కూడా జరిగింది. సమ్మె తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. తమకు అదనపు విద్యుత్తు, గ్యాస్, బొగ్గు కేటాయించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ను కోరారు. ఈ మేరకు ఆయన మన్మోహన్ సింగ్కు ఫోన్ చేశారు. ఆర్టీసి కాంట్రాక్టు కార్మికులను తొలగించేందుకు యాజమాన్యం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలను అన్నింటినీ సమావేశంలో కెసిఆర్ చర్చించినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications