Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణ తాజా ప్రతిపాదన అంగీకారయోగ్యమేనా?

హైదరాబాద్: రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాలతో కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు, కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాదు ప్రకటన అనే తాజా కాంగ్రెసు అధిష్టానం ప్రతిపాదన అన్ని ప్రాంతాలవారికీ అంగీకారయోగ్యమవుతుందా అనే చర్చ సాగుతోంది. హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా చేయడానికి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు, కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులే కాకుండా మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా వ్యతిరేకంగానే ఉన్నారు. అయితే, కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు ఓ ప్రతిపాదన చేస్తూ వస్తున్నారు. హైదరాబాదు తెలంగాణలో అంతర్భాగమని, అయితే, పదేళ్ల పాటు హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా ఉంచడానికి తమకు అంగీకారమేనని, ఈలోగా సీమాంధ్రలో రాజధానిని అభివృద్ధి చేసుకోవాలని వారంటున్నారు. ఈ ప్రతిపాదన కెసిఆర్‌కు అంగీకారయోగ్యమో, కాదో తెలియదు. అయితే, కెసిఆర్‌ను కె. కేశవరావు లాంటి కాంగ్రెసు నాయకులు ఒప్పించే అవకాశాలున్నాయి.

అనంతపురం, కర్నూలు జిల్లాలతో కొత్త రాష్ట్ర ఏర్పాటుకు కెసిఆర్, అసదుద్దీన్ కూడా సుముఖంగానే ఉన్నారు. రాయలసీమకు చెందిన మంత్రి టిజి వెంకటేష్ భిన్నస్వరం వినిపిస్తున్నారు. రాయలసీమ ప్రాంతంలో అనంతపురం, కర్నూలు జిల్లాలతో పాటు చిత్తూరు, కడప జిల్లాలున్నాయి. రెండు జిల్లాలు తెలంగాణలోకి వస్తే, మరో రెండు జిల్లాలు ఆంధ్రలోకి వెళ్తాయి. దీనికి రాయలసీమ ప్రాంత నాయకులు ఇష్టపడకపోవచ్చు. అయితే, కృష్ణా నదీజలాలపై రాయలసీమ ప్రాంతంలో ఆందోళన వ్యక్తమవుతోంది. మిగులు జలాల వాడకం పేరుతో నికరజలాలను వాడుకోవడానికి రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులు చేపట్టారు. ఆ జలాలను ఖాయం చేసుకోవడానికి మాత్రమే వారు ఎక్కువగా ప్రయత్నించవచ్చు.

అయితే, కాంగ్రెసు అధిష్టానం రాయబారిగా మజ్లీస్ నేత అసదుద్దీన్ ఓవైసీ తన వద్దకు తెలంగాణ కోసం ప్రతిపాదనలను తెచ్చారని కెసిఆర్ చెబుతున్న మాటలపై అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కెసిఆర్ ప్రకటనను అసదుద్దీన్ ఖండించారు. తాను తెలంగాణపై గానీ హైదరాబాదుపై గానీ కెసిఆర్‌తో మాట్లాడలేదని, కేవలం సచార్ కమిటీ నివేదికపైనే మాట్లాడానని ఆయన అన్నారు. అనంతపురం, కర్నూలు జిల్లాలతో కలిపి తెలంగాణ ఏర్పడుతుందని చెబుతూ కెసిఆర్ నాటకాలు ఆడుతున్నారని తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. కెసిఆర్ అబద్ధాలు చెబుతూ కాలం గడుపుతున్నారని ఆయన అన్నారు. కాంగ్రెసుకు, తెరాసకు మధ్య జరిగిన ఒప్పందమేమిటో కెసిఆర్ బయటపెట్టాలని తెలుగుదేశం శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు.

కాంగ్రెసు నాయకులు కూడా కెసిఆర్ మాటలను ఖండిస్తున్నారు. ఇంకా చర్చలు జరుగుతున్న క్రమంలో అటువంటి ప్రతిపాదన ఎలా పెడుతామని వారంటున్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి నివేదిక సమర్పించాల్సి ఉంది. కాంగ్రెసు అధిష్టానం ఇప్పటికి వరకు ఏ విధమైన నిర్ణయానికి రాలేదని, అందువల్ల కెసిఆర్ ముందు ప్రతిపాదనలు పెట్టే ప్రసక్తే ఉండదని అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+