ప్రణబ్ తెలంగాణ ప్రకటన బాధ కలిగించింది: కెకె

తెలంగాణ సెంటిమెంట్ను ఎవరూ కాదనడం లేదని, నిర్ణయానికి సమయం పట్టవచ్చునేమో, జాప్యం కూడా చేయలేమోనని కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ తమతో చెప్పారని ఆయన అన్నారు. సీమాంధ్రలో కూడా సెంటిమెంటు ఉందని, దానిపై కూడా కసరత్తు చేసి త్వరలోనే ప్రకటన చేస్తామని ప్రణబ్ చెప్పారని ఆయన అన్నారు. ప్రణబ్తో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నానని, ఓ లేఖ రాస్తానని ఆయన అన్నారు.
తమ ఢిల్లీ పర్యటన ఆశావహంగా జరిగిందని కె. కేశవ రావు అన్నారు. కాంగ్రెసు అధిష్టానం పెద్దలతో చర్చలు సుదీర్ఘంగా జరిగాయని ఆయన అన్నారు. తెలంగాణపై సెప్టెంబర్ 30వ తేదీ వరకు నిర్ణయం ప్రకటించాలని కోరామని, అందుకే ఢిల్లీ వెళ్లామని ఆయన చెప్పారు. సంప్రదింపుల పేరుతో జాప్యం చేయవద్దని, జాప్యం చేస్తే పరిస్థితి విషమిస్తుందని ఆయన అన్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీలతో చర్చించిన తర్వాత కొంత సంతృప్తి కలిగిందని, అయితే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణపై నిర్ణయం వెలువడితే పూర్తి సంతృప్తి కలిగేదని ఆయన అన్నారు.
ప్రజల్లో అసహనం పెరుగుతోందని, దాన్ని అధిష్టానం పెద్దల దృష్టికి తీసుకుని వెళ్లామని ఆయన అన్నారు. కేవలం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకే తెలంగాణలోని అన్ని వర్గాలు సమ్మె చేస్తున్నాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications