చంద్రబాబు కేసును హైదరాబాద్ సిబిఐ చేపట్టదా?

హైదరాబాద్ సిబిఐపై చంద్రబాబు ఆస్తుల కేసు విచారణ భారాన్ని వేయకూడదని సిబిఐ - ఢిల్లీ అనుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. చంద్రబాబు ఆస్తుల కేసు విచారణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇందుకు హైదరాబాదులో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తారని కూడా అంటున్నారు. ఈ విభాగంలో ఇతర రాష్ట్రాల నుంచి అధికారులను వేయడం గానీ మొత్తం దర్యాప్తును ఆ విభాగానికి అప్పగించడం గానీ చేస్తారని సమాచారం. విశాఖపట్నం నుంచి కూడా వివిధ కేసుల విచారణకు అధికారులను రప్పించారు.
ప్రస్తుత కేసుల్లో స్వాధీనం చేసుకున్న పత్రాల పరిశీలనలో సిబిఐ పూర్తిగా మునిగిపోయి ఉంది. ఈ కేసులకు సంబంధించి కేవలం ముగ్గురు పర్యవేక్షణాధికారులు మాత్రమే ఉన్నారు. వారు - జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మినారాయణ, ఎస్పీ హెచ్. వెంకటేష్, అదనపు ఎస్పీ ఆర్ఎం ఖాన్. ఈ అధికారులు రాత్రింబవళ్లు సెలవు దినాల్లో, ఆదివారాల్లో కూడా పని చేస్తున్నారు. గాలి జనార్దన్ రెడ్డి కేసులో సిబిఐ డిసెంబర్ 1వ తేదీలోగా చార్జిషీట్ దాఖలు చేయాల్సి ఉంది. చంద్రబాబు ఆస్తుల కేసులో ప్రాథమిక దర్యాప్తు నివేదికను సమర్పించడానికి హైకోర్టు మూడు నెలల గడువు మాత్రమే ఇచ్చింది. దీంతో చంద్రబాబు కేసు విచారణను హైదరాబాద్ సిబిఐ చేపట్టే అవకాశాలు లేవని అంటున్నారు.












Click it and Unblock the Notifications