హస్మత్పేటలో హైడ్రా యాక్షన్ వెనుక అసలు నిజం ఇదే.. రూ.750 కోట్ల భూదందాకు చెక్!
హస్మత్పేటలో హైడ్రా చేపట్టిన చర్యలపై కొందరు రాజకీయ నాయకులు చేస్తున్న ఆరోపణలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీవ్రంగా ఖండించారు. నిరుపేదల ఇళ్లను కూల్చేశారంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని.. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని స్పష్టం చేశారు. అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా రాజకీయ విమర్శలు చేయడం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు.
హస్మత్పేట సర్వే నంబర్-1లో మొత్తం 108 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని రంగనాథ్ తెలిపారు. అయితే గత అనేక దశాబ్దాలుగా జరిగిన అక్రమ ఆక్రమణల కారణంగా ఇప్పటికే 98 ఎకరాల భూమి కబ్జాకు గురైందని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వానికి కేవలం 10 ఎకరాల భూమి మాత్రమే మిగిలి ఉందని, ఆ చివరి ప్రభుత్వ భూమిని కూడా కాపాడకపోతే భవిష్యత్ తరాలకు ప్రజా అవసరాల కోసం భూమి అందుబాటులో ఉండదని అన్నారు.

ఇంకా మాట్లాడుతూ.. ప్రజలు ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలన్నారు. హైడ్రా ఇప్పటికే నివాసం ఉంటున్న ఒక్క శాశ్వత ఇంటిని కూడా కూల్చలేదని.. జీవో నెం.58, 59 కింద క్రమబద్ధీకరించిన ఇళ్లను ధ్వంసం చేశారనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని వ్యాఖ్యానించారు. మేము కూల్చింది కేవలం ప్రభుత్వ భూమిపై కొత్తగా నిర్మించిన ప్రీకాస్ట్ గోడలు, తాత్కాలిక షెడ్లు, అక్రమ కంచెలు, ప్లాట్లుగా మార్చేందుకు వేసిన మార్కింగ్లు, అక్రమ నిర్మాణాల ప్రారంభ దశలో ఉన్న నిర్మాణాలను మాత్రమే" అని రంగనాథ్ స్పష్టం చేశారు.
ఈ ఆపరేషన్ పూర్తిగా చట్టబద్ధంగా నిర్వహించామని ఆయన వెల్లడించారు. రెవెన్యూ శాఖ అధికారుల నుంచి లిఖితపూర్వకంగా వచ్చిన విజ్ఞప్తి మేరకే హైడ్రా చర్యలు చేపట్టిందని తెలిపారు. రెవెన్యూ అధికారులు, పోలీసుల సమక్షంలో ప్రభుత్వ రికార్డులను పరిశీలించిన తర్వాతే ఈ డ్రైవ్ నిర్వహించామని, ఇందులో ఎలాంటి ఏకపక్ష నిర్ణయం లేదని వివరించారు.
అంతే కాకుండా ఇది హైడ్రా స్వతంత్రంగా తీసుకున్న నిర్ణయం కాదని.. ప్రభుత్వ భూమిని రక్షించేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో చేపట్టిన చర్య మాత్రమేనన్నారు . దీనికి రాజకీయ రంగు పులమడం సరైంది కాదని.. ప్రభుత్వ ఆస్తిని కాపాడడం ప్రతి ప్రభుత్వ సంస్థ బాధ్యత" అని ఆయన అన్నారు. హస్మత్పేటలో కాపాడిన 10 ఎకరాల ప్రభుత్వ భూమి మార్కెట్ విలువ సుమారు రూ.750 కోట్లకు పైగా ఉంటుందని రంగనాథ్ వెల్లడించారు. ఇంత విలువైన ప్రజా ఆస్తి కూడా కబ్జాకు గురైతే, భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులు, పార్కులు, కమ్యూనిటీ హాళ్లు, రహదారులు, ప్రజా సేవా కేంద్రాల నిర్మాణానికి భూమి దొరకదని ఆందోళన వ్యక్తం చేశారు.
అక్రమ ఆక్రమణలను మొదటి దశలోనే అడ్డుకోకపోతే తర్వాత వాటిని తొలగించడం మరింత క్లిష్టమవుతుందని ఆయన చెప్పారు. అందుకే ప్రభుత్వ భూములపై కొత్తగా జరుగుతున్న ఆక్రమణలను వెంటనే గుర్తించి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలు మోసపోయి ప్రభుత్వ భూముల్లో ప్లాట్లు కొనుగోలు చేయవద్దని, కొనుగోలు చేసే ముందు రెవెన్యూ రికార్డులను తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు.
సోషల్ మీడియాలో, కొన్ని రాజకీయ వేదికలపై తప్పుడు సమాచారం ప్రచారం చేయడం వల్ల ప్రజల్లో అనవసర ఆందోళన నెలకొంటోందని ఆయన అన్నారు. అధికారిక సమాచారం తెలుసుకోకుండా వదంతులను నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హస్మత్పేటలో జరిగినది పేదల ఇళ్ల కూల్చివేత కాదని, ప్రభుత్వానికి చెందిన రూ.750 కోట్ల విలువైన ప్రజా ఆస్తిని అక్రమ కబ్జాల నుంచి రక్షించిన చట్టబద్ధమైన పరిపాలనా చర్య మాత్రమేనని మరోసారి స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications