సంక్రాంతి తర్వాతే జగన్ క్యాంప్ ఎమ్మెల్యేలపై చర్యలు
విప్ను ధిక్కరించిన శానససభ్యుల వివరణలు తనకు అందాయని, వాటిని పరిశీలిస్తున్నానని స్పీకర్ మనోహర్ శుక్రవారం చెప్పారు. ప్రజారాజ్యం పార్టీ తిరుగుబాటు శాసనసభ్యురాలు శోభా నాగిరెడ్డి రెండో సారి చేసిన రాజీనామా లేఖ కూడా తనకు అందిందని ఆయన చెప్పారు. జగన్ వర్గానికి చెందిన కాపు రామచంద్రా రెడ్డి మాత్రం మెలిక పెడుతున్నారు. తనకు విప్ అందలేదని, తనకు నోటీసు ఒరిజినల్ ప్రతి కావాలని ఆయన అడుగుతున్నారు. దీంతో కాపు రామచంద్రా రెడ్డికి స్పీకర్ మరోసారి నోటీసు జారీ చేసే అవకాశం ఉందని అంటున్నారు.
తెలంగాణలోని ఆరు స్థానాలకు, కోవూరు శాసనసభా స్థానానికి ఉప ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో జారీ అయ్యే అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్ జారీ అయి, ఉప ఎన్నికల ప్రక్రియ సాగుతున్న క్రమంలో వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులపై అనర్హత వేటు వేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. వీటితో పాటు జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యుల స్థానాలకు ఒకేసారి ఉప ఎన్నికలు రాకుండా కాంగ్రెసు జాగ్రత్త పడుతోందని అంటున్నారు.
కాగా, వైయస్ జగన్ వర్గానికి చెందిన తమ పార్టీ ఎమ్మెల్సీలపై మండలి చైర్మన్ చక్రపాణికి ఫిర్యాదు చేసేందుకు కాంగ్రెసు పార్టీ సమాయత్తమవుతోంది. జగన్ వర్గానికి చెందిన ఎమ్మెల్సీలు పుల్లా పద్మావతి, ఎస్పీ రెడ్డి, కొండా మురళి, ప్రభాకర రావులపై జనవరి 2వ తేదీన విప్ శివరామిరెడ్డి చక్రపాణికి ఫిర్యాదు చేయనున్నారు.