కెసిఆర్ జయశంకర్ను తన్నాడు!: మోత్కుపల్లి
తెలంగాణ సెంటిమెంట్ అడ్డు పెట్టుకొని కెసిఆర్ యాభైవేల కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపించారు. వాటిని తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకున్న అమరవీరుల కుటుంబాలకు పంచాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ అవసరాన్ని బట్టి తెలంగాణ అంటూ నాటకమాడుతారన్నారు. తన కోసం, తన కుటుంబం కోసం ఎలాంటి మోసానికైనా పాల్పడతారన్నారు. ఆయన నాటకాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. అమరవీరులను ప్లాట్ ఫాం గాళ్లు అన్న ఘనత ఆయనదే అన్నారు. తాను కాల్మొక్తి చెబుతున్నానని కెసిఆర్ను ఎవరూ నమ్మొద్దన్నారు. ఆయన పచ్చి సమైక్యవాది అని, ఇక్కడ జై తెలంగాణ అంటూ ఢిల్లీ వెళ్లి నై తెలంగాణ అంటారన్నారు. కెసిఆర్ అంటే కింగ్ ఆఫ్ చీటర్స్ అండ్ రోబర్స్ అన్నారు. కెసిఆర్ వంటి దుర్మార్గుడు ఉద్యమనేతగా పనికి రాడన్నారు. ఆయన తాగేది తెలంగాణ రక్తం పాడేది సీమాంధ్ర పాట అని, ఆయనతో తెలంగాణ రాదన్నారు. తెలంగాణ రాదని ప్రధాని మన్మోహన్ సింగ్తో చెప్పించింది ఆయనేనన్నారు. కెసిఆర్ సమైక్యవాదం అందరూ అర్థం చేసుకోవాలన్నారు.
తెలంగాణ తెమ్మని ఆయనను గెలిపిస్తే మంత్రి పదవి తీసుకొని మోసం చేశాడన్నారు. ఆయన దగా ఎంతోకాలం కొనసాగదన్నారు. సకల జనుల సమ్మెను సకల సంపదగా మార్చుకున్నారని దుయ్యబట్టారు. సోనియా గాంధీ ఇంటి ముందు తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టు పెట్టిన ద్రోహి అని, విద్యార్థులు చచ్చిపోతే ఫాం హౌస్లో ఎలా పడుకుంటాడని ప్రశ్నించారు. టిడిపిని రాజకీయంగా పాతిపెట్టాలనే కుట్రతో కాంగ్రెసు, టిఆర్ఎస్ కుమ్మక్కయ్యాయన్నారు. పోలవరం కాంట్రాక్టు తర్వాతే కెసిఆర్ వెనక్కి తగ్గారన్నారు. కెసిఆర్ ఏ బ్రాండ్ తాగినప్పుడు ఏం మాట్లాడతారో ఎవరికీ అర్థం కావడం లేదన్నారు. రైతుల గురించి ఎందుకు మాట్లాడటని ప్రశ్నించారు. విజయశాంతి ఎవరని, తెలంగాణ వారికి కాకుండా ఆంధ్రాలో పుట్టిన ఆమెకు ఎంపీ టిక్కెట్ ఇచ్చి గెలిపించారని ప్రశ్నించారు. మిస్టర్ కెసిఆర్ నీ ఆటలు సాగేందుకు ఇక వీలులేదన్నారు.