ఎర్రబెల్లి దయాకర్ రావుపై వరంగల్లు జిల్లాలో కేసు
ఇదిలా వుంటే, చంద్రబాబు వరంగల్లు జిల్లా పర్యటన నేపథ్యంలో శాసనసభ్యుడు వినయ్ భాస్కర్ సహా పలువురిని పోలీసులు ముందస్తు జాగ్రత్తగా అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబు జిల్లా పర్యటనను అడ్డుకుంటామని తెరాస నాయకులు చెబుతున్నారు. కాగా, చంద్రబాబు వరంగల్లు జిల్లా పర్యటనపై తెరాస నాయకులు మండిపడుతున్నారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించిన తర్వాతనే చంద్రబాబును తెలంగాణలో పర్యటనకు అనుమతిస్తామని తెరాస నాయకుడు వినోద్ కుమార్ అన్నారు. తాను సమైక్యవాదిని చెప్పినా కూడా చంద్రబాబును అడ్డుకోబోమని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు తెలంగాణ ఉద్యమాన్ని అణచేయాలని చూస్తున్నారని ఆయన అన్నారు. జగన్, చంద్రబాబు యాత్రలను ముఖ్యమంత్రి స్పాన్సర్ చేస్తున్నారని ఆయన అన్నారు.
చంద్రబాబును తెలంగాణ నగారా సమితి నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి తెలంగాణ ద్రోహిగా అభివర్ణించారు. చంద్రబాబు చేసేది రైతు పోరుబాటు కాదని, తెలంగాణ ఉద్యమంపై దాడి అని ఆయన హైదరాబాదులో మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ టిడిపి నేతలు సీమాంధ్ర నాయకులకు అమ్ముడు పోయారని ఆయన అన్నారు. ప్రజలు వద్దంటున్నా చంద్రబాబు తెలంగాణలో పర్యటిస్తానని చెప్పడం హాస్యాస్పదమని తెరాస పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి అన్నారు. స్పష్టమైన ప్రకటన చేసేవరకు సీమాంధ్ర ప్రజాప్రతినిధులను తెలంగాణలో తిరగనివ్వబోమని ఆమె అన్నారు. విడిపోదామని తాము అంటుంటే కలిసుందామని సీమాంధ్ర నాయకులు అంటున్నారని ఆమె అన్నారు. చంద్రబాబు తెలంగాణ పర్యటనపై తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ కూడా తీవ్రంగా మండిపడ్డారు.