చిరంజీవి ఇంటికి కిరణ్ కుమార్, అనిల్కు విప్ పదవి
కాగా, తాజా రాజకీయ పరిణామాలపై కూడా చిరంజీవికి, కిరణ్ కుమార్ రెడ్డికి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. కడప జిల్లాకు చెందిన రవీంద్రా రెడ్డి తనపై తీవ్రమైన విమర్శలు చేసిన నేపథ్యంలో అదే జిల్లాకు చెందిన సి. రామచంద్రయ్య ఆ జిల్లా రాజకీయాలను ఏ మేరకు ముందుకు నడిపిస్తారనే విషయంపై కిరణ్ కుమార్ రెడ్డి చిరంజీవి నుంచి ఆరా తీసినట్లు సమాచారం. అలాగే, రాబోయే ఉప ఎన్నికల్లో ప్రచార బాధ్యతలను చిరంజీవి తీసుకునే విషయంపై కూడా మాట్లాడినట్లు తెలుస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి వెళ్లడానికి ముందే రెవెన్యూ మంత్రి ఎన్ రఘువీరా రెడ్డి చిరంజీవి నివాసానికి వెళ్లి ప్రాథమిక చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
చీఫ్ విప్గా వరంగల్ జిల్లాకు చెందిన గండ్ర వెంకటరమణా రెడ్డిని, విప్లుగా ఆరేపల్లి మోహన్, ద్రోణం రాజు శ్రీనివాస్లను నియమించే విషయంపై కూడా కిరణ్ కుమార్ రెడ్డి చిరంజీవితో మాట్లాడినట్లు సమాచారం. ఈ నెల 13వ తేదీన శాసనసభా సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో సాంకేతిక విలీనం చేసే విషయంపై కూడా మాట్లాడినట్లు సమాచారం. చిరంజీవిని శాసనసభా పక్ష ఉప నేతగా నియమించి సభలో ముందు వరుస సీటు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. విద్యుత్తు ఆదాకు ముఖ్యమంత్రి బచత్ ల్యాంప్ యోజను ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు. దీని గురించి కూడా ఆయన చిరంజీవికి వివరించినట్లు చెబుతున్నారు.