ఏం జరుగుతుంది?: జగన్ వర్గం ఎమ్మెల్యేల తలో దారి!
విచారణ సమయంలో ప్రజారాజ్యం పార్టీ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగి రెడ్డి తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి పార్టీని కాంగ్రెసులో విలీనం చేసినందు వల్ల తనకు విప్ వర్తించదని చెప్పారు. ఆ తర్వాత ఆమె రాజీనామా సమర్పించారు. రాజీనామా సమర్పించిన ఆమె బడ్జెట్ సమావేశాలకు హాజరు కావడం గమనార్హం. రాజీనామా చేసిన తర్వాత సభకు హాజరైతే అది చెల్లదు. మరో ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డి తనకు విప్ అందలేదని, తనపై వేటు వేస్తే న్యాయ పోరాటం చేస్తానని చెప్పారట. ఆయన క్రమంగా జగన్కు దూరమవుతున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అందుకే ఆయన న్యాయపోరాటం చేస్తానని అంటున్నారని చెబుతున్నారు. ఇక జగన్ వర్గంలో ముఖ్యమైన నేత పిల్లి సుభాష్ చంద్ర బోసు శుక్రవారం హఠాత్తుగా రాజీనామా సమర్పించారు. తన నియోజకవర్గానికి నిధుల కేటాయింపులో చూపిస్తున్న వివక్ష కారణంగానే తాను రాజీనామా చేస్తున్నట్టు ఆయన చెప్పారు.
శాసనమండలి సభ్యురాలు పుల్లా పద్మావతి ఇటీవల సిఎల్పీ సమావేశాలకు హాజరయ్యారు. అదే సమయంలో ఆమె అంతకుముందు ఆర్మూర్లో జగన్ చేపట్టిన దీక్షకు హాజరు కాలేదు. గత మూడు సమావేశాలకు ఎమ్మెల్యేలు పూర్తిస్థాయిలో హాజరు కాలేదు. అందుకు ఆ వర్గం ఎమ్మెల్యేలు ప్రతి సమావేశానికి అందరు హాజరు కావాలని లేదు కదా అని చెప్పి చేతులు దులుపుకున్నారు. కానీ ఆ తర్వాత పరిణామాలు మాత్రం గందరగోళంగా ఉన్నాయని పలువురు భావిస్తున్నారు. తాము వ్యూహాత్మకంగానే వెళుతున్నామని జగన్ వర్గం చెబుతున్నప్పటికీ విపక్షాలు వారి మాటలను కొట్టి పారేస్తున్నాయి.