సీటు కోసం పోటా పోటీ: చిరంజీవి, శారద, రేణుక..?
2014లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవని ప్రచారం జరుగుతుండటంతో రాజ్యసభలో స్థానం దక్కించుకునేందుకు పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులు, సంపన్నులు సిద్ధమయ్యారని చెబుతున్నారు. ఇప్పటికే రెండు సీట్లు అమ్ముడు పోయాయని ప్రచారం జరుగుతోందట. దీనిపై కొందరు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా సమాచారం. సోనియాకు ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారట. కాగా, ఢిల్లీలోని హోటళ్లు, కంపెనీల అతిథి గృహాలు, ఎంపిల ఇళ్లు ఆశావహులతో కిటకిట లాడుతున్నాయి. వీరిలో రాష్ట్రానికి చెందిన నేతల సందడే ఎక్కువగా ఉంది. పార్లమెంట్ సెంట్రల్ హాలులోనైతే ఎంపిల కన్నా మాజీ ప్రజా ప్రతినిధులే ఎక్కువ కనపడుతున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ అపాయింటుమెంట్ కోసం నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. కె కేశవ రావుకు కూడా మళ్లీ సీటు ఇవ్వాలని తెలంగాణ ఎంపీలు ఆజాద్ను కలిసి ఇప్పటికే విజ్ఞప్తి చేశారం. సీనియర్ నేత కంతేటి సత్యనారాయణ రాజు కూడా ఆజాద్ను కలుసుకున్నారు.
కిరణ్ న్యాయసలహాదారులు రఘు రెడ్డి పేర్లు కూడా చర్చకు వస్తున్నాయట. పొంగులేటి సుధాకర్ రెడ్డి, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూడా ఢిల్లీలో ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త జివికే పేరు కూడా వినిపిస్తోంది. దళిత నేతల్లో మాజీ ఎంపి మల్లు రవి, వెంకట స్వామి పెద్ద కుమారుడు వినోద్ తీవ్ర ప్రయత్నాలు చేసుకుంటున్నారు. తెనాలి మాజీ ఎంపి బాల శౌరి కూడా రాజ్యసభ సీటు కోసం రంగంలో ఉన్నట్లు తెలుస్తోంది. సినీ నిర్మాత ఘట్టంనేని ఆదిశేషగిరి రావు, మాజీ సినీ నటి శారద పేర్లు కూడా వినిపిస్తున్నాయి. పత్రికాధిపతులు గిరీష్ సంఘీ, వెంకట్రామి రెడ్డి కూడా ప్రయత్నాలు చేసుకుంటున్నట్లుగా సమాచారం.
ఇక తెలుగుదేశం పార్టీలోనూ సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, ఎర్రన్నాయుడు,. సిఎం రమేష్, మైసూరా రెడ్డిలు పోటీలో ఉన్నారు. మరోవైపు దేవేందర్ గౌడ్కు అవకాశం కల్పిస్తే తెలంగాణలో మళ్లీ పార్టీ బలపడేందుకు ఉపయోగపడుతుందని కొందరు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకు వెళుతున్నారట. వర్ల రామయ్య, నర్సింహులు, అలీఖాన్ తదితరులు కూడా సీటు ఆశిస్తున్న వారులో ఉన్నట్లుగా సమాచారం. మొత్తానికి రాజ్యసభ సీటు కోసం పోటీ పోటీగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.