వాగులో పడిన బస్సు, 12 మంది విద్యార్థుల మృతి
కొత్తగూడెం మండలం వేపలగండ్ల గ్రామానికి చెందిన ఎల్వీ రెడ్డి పాఠశాల బస్సు వాగులో పడింది. దీంతో ప్రమాదం సంభవించింది. బస్సు ఎందుకు అదుపు తప్పిందనేది తెలియడం లేదు. బస్సు డ్రైవర్ ఆచూకీ కూడా తెలియడం లేదు. విద్యార్థులను బస్సులో పాఠశాల నుంచి వారివారి స్వస్థలాలకు తీసుకుని వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. బస్సులో 50 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది.
సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాయంత్రం ఐదున్నర గంటల సమయానికి ఎనిమిది మృతదేహాలను వెలికి తీశారు. మృతుల్లో నవ్య, మణికంఠ, గణేష్, సౌజన్య, సంతోష్ ఉన్నట్లు చెబుతున్నారు.