కిరణ్, బొత్సలకు ఆజాద్ క్లాస్, ఆధిపత్య పోరుపై ఆగ్రహం

ఆజాద్తో భేటీకి ముందు బొత్స సత్యనారాయణ, దామోదర రాజనర్సింహ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మాట్లాడాల్సిన విషయాలపై ఇరువురు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆజాద్ వద్దకు వెళ్లారు. కిరణ్ కుమార్ రెడ్డికి, బొత్స సత్యనారాయణకు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నట్లు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో వారిద్దరి మధ్య సయోధ్యకు ఆజాద్ ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే, దామోదర రాజనర్సింహను కలుపుకుని పోవాల్సిన అవసరాన్ని కూడా ఆయన గుర్తు చేసినట్లు చేసినట్లు చెబుతున్నారు. పార్టీ నాయకులందరినీ కలుపుకుని పోవాలని ఆజాద్ ముఖ్యమంత్రికి సూచించినట్లు తెలుస్తోంది.
ఆజాద్ నివాసానికి ముఖ్యమంత్రి సాయంత్రం ఐదు గంటలకు రాగా, ఆ తర్వాత 20 నిమిషాలకు దామోదర, బొత్స కలిసి అక్కడికి చేరుకున్నారు. సమావేశానంతరం మాత్రం ముగ్గురు కలిసి ఎపి భవన్కు చేరుకున్నారు. అక్కడ వీరు ముగ్గురు మళ్లీ సమావేశమయ్యారు. వచ్చే 18 స్థానాల ఉప ఎన్నికల కోసం ఏడుగురితో సమన్వయ కమిటీ వేయాలని భావిస్తున్నట్లు సమాచారం. కనీసం ఆరు సీట్లు గెలుచుకోగలిగినా పరువు దక్కుతుందనే ఉద్దేశంతో, అందుకు అనుగుణమైన వ్యూహాన్ని రచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆధిపత్య పోరు మానుకోవాలని ఆజాద్ ముగ్గురు నాయకులకు కూడా హితబోధ చేసినట్లు తెలుస్తోంది. విభేదాలతో రచ్చకెక్కితే పార్టీకి, ప్రభుత్వానికి కూడా నష్టం వాటిల్లుతుందని, ఉప ఎన్నికలను ఎదుర్కోవాల్సిన స్థితిలో అది మంచిది కాదని ఆజాద్ వారికి వివరించినట్లు తెలుస్తోంది. కాగా, ముఖ్యమంత్రిని మారుస్తారనే దాకా ప్రచారం ఊపందుకుంది. అయితే, అటువంటిదేమీ ఉండకపోవచ్చునని అంటున్నారు. అయితే, తెలంగాణపై ఆజాద్ వారితో ఏమైనా మాట్లాడారా, లేదా అనేది తెలియడం లేదు.












Click it and Unblock the Notifications