బోగస్ దాతల నుంచి శ్రీవారికి 100 కిలోల బంగారం

ఆనంద నిలయం - అనంత స్వయంవరం ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. దీంతో దాని కోసం విరాళాలు ఇచ్చిన దాతలకు తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) లేఖలు రాయడం ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు కోసం ప్రదానం చేసిన బంగారాన్ని ఇతర ప్రాజెక్టులకు వాడుకోవడానికి అనుమతిస్తారా, లేదంటే వెనక్కి తీసుకుంటారా తెలపాలని కోరుతూ టిటిడి దాతలకు లేఖలు రాసింది. కొంత మంది దాతల చిరునామాలు తప్పుగా ఉన్నట్లు ఈ క్రమంలో టిటిడి గుర్తించింది.
తమ పేర్ల మీద బంగారం విరాళంగా ఇచ్చినప్పటికీ కొంత మంది దాతలు తప్పుడు చిరునామాలు ఇచ్చారని టిటిడి అధికారులు అంటున్నారు. బోగస్ దాతలు ఇచ్చిన బంగారాన్ని ఏం చేయాలనే సందేహంలో టిటిడి అధికారులు పడ్డారు. బంగారం కోశాగారంలోని సేఫ్ కస్టడీలో ఉందని అధికారులు అంటున్నారు. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ప్రాజెక్టు పనులు చేపట్టకూడదని సుప్రీంకోర్టు ఆదేశించింది.
కాగా, శతాబ్దాల క్రితం లిపి చెదిరిపోతుందని, తిరుమల ఆలయ నిర్మాణం బలహీన పడుతుందని బంగారు పూతపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే ఇచ్చింది. తిరుమల ఆలయ గోడలపై గల ప్రాచీన లిపిని పరిరక్షించాల్సి ఉందని, బంగారు పూత వల్ల అవి మరుగుపడుతాయని, అందువల్ల బంగారు పూతను ఆపేయాలని ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాదిస్తోంది.