ఆత్మహత్యల పాపం టిడిపి, కాంగ్రస్దే: కోదండరామ్
తెలంగాణపై మాట్లాడకుంటే కాంగ్రెసు నేతలు దోషులుగా నిలబడాల్సి వస్తుందన్నారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకునే విధంగా కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి కాంగ్రెసు పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తీసుకు రావాలన్నారు. వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు.
తెలంగాణపై తెలుగుదేశం పార్టీ ధాటవేత ధోరణి అవలంభిస్తోందని ఆయన ఆరోపించారు. తెలంగాణపై కేంద్రమంత్రి చిదంబరం వ్యాఖ్యలు, తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీల బాధ్యతారాహిత్యం వల్లనే తెలంగాణ ప్రాంతంలో ఆత్మహత్యలు జరుగుతున్నాయని అన్నారు. పార్లమెంటు సమావేశాలలోపు ఆ రెండు పార్టీలు తెలంగాణపై అధికారికంగా నిర్ణయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆ పార్టీ తెలంగాణ నేతలు బయటకు వచ్చి పోరాడాలని హెచ్చరించారు.
తెలంగాణ సాధన కోసం ఆత్మబలిదానాలు మార్గం కాదన్నారు. అందరం సంఘటితంగా పోరాడి తెలంగాణ సాధించుకుందామని పిలుపునిచ్చారు. తెలంగాణపై కాంగ్రెసు, టిడిపిల వైఖరి ఎండగడుతూ, ఆత్మహత్యలు వద్దని చెబుతూ ఈ నెల 10 నుండి 20 వరకు ర్యాలీలు, బస్సు యాత్రలు చేపడతామన్నారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను తాము వ్యతిరేకిస్తామన్నారు. ఇలాంటి ప్రతిపాదనలు కేంద్రం ఉపసంహరించుకోవాలన్నారు.