ఉప పోరుపై సమీక్ష: రాయపాటి గుస్సా, డుమ్మా

గుంటూరు జిల్లాలోని పత్తిపాడు, మాచర్ల శాసనసభా స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. పత్తిపాడు నియోజకవర్గానికి తనను కాకుండా మంత్రి కన్నా లక్ష్మినారాయణను ఇంచార్జీగా నియమించడంపై రాయపాటి సాంబశివరావు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. పత్తిపాడు, మాచర్ల నియోజకవర్గాలకు మంత్రులు కన్నా లక్ష్మినారాయణను, కాసు వెంకట కృష్ణా రెడ్డిని ఇంచార్జీలుగా నియమించారు. దీంతో రాయపాటి సాంబశివరావు అలిగినట్లు చెబుతున్నారు.
కాగా, మరో పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావు కూడా సమీక్షా సమావేశానికి హాజరు కాలేదు. అయితే, తనకు ఢిల్లీలో పనులు ఉన్నందున రాలేకపోతున్నట్లు ఆయన బొత్స సత్యనారాయణకు తెలిపారు. మరో కాంగ్రెసు అగ్రనేత చిరంజీవి కూడా సమావేశానికి రాలేదు. వ్యక్తిగత కారణాల వల్ల ఆయన రాలేదని తెలుస్తోంది. చిరంజీవి తరఫున మంత్రి గంటా శ్రీనివాస రావు సమావేశంలో పాల్గొన్నారు.
ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ను టార్గెట్ చేసుకోవాలని కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ సమన్వయ కమిటీలకు సూచించినట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల సమన్వయ కమిటీలు వారం రోజుల పాటు తమ తమ మండలాల్లో పర్యటించి నివేదికలు సమర్పించాలని వారు కోరారు. ఉప ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలని వారు జిల్లాల నాయకులకు చెప్పారు. ప్రజాపథం కార్యక్రమాన్ని ప్రచారానికి వాడుకోవాలని సూచించారు.
కాగా, ఎస్సీ ఓటర్లు కాంగ్రెసుకు దూరమై, జగన్ వైపు మళ్లారని అభిప్రాయపడుతున్నారు. వారు తిరిగి కాంగ్రెసు వైపు రావడానికి ఏం చేయాలనే విషయంపై సమన్వయ కమిటీలు జాగ్రత్తగా అధ్యయనం చేయాలని కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స నాయకులకు సూచించారు. స్థానిక సమస్యలను అధ్యయనం చేసి ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుందనే విషయంపై సూచనలు ఇవ్వాలని చెప్పారు.












Click it and Unblock the Notifications