చిరు ఇంటికి రవి: అలవాటని దామోదర్కు దానం కౌంటర్
పాల్వాయి ఇంటికి వెళ్లినప్పుడు ప్రశ్నించని నేతలు చిరంజీవి ఇంటికి వెళ్లడాన్ని తప్పు పడితే ఎలా అని ప్రశ్నించారు. గత సంవత్సరం డిసెంబరు నెలలో తెలుగుదేశం పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన సమయంలో చిరంజీవి తన ఎమ్మెల్యేలతో ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయించి ప్రభుత్వాన్ని కాపాడారని గుర్తు చేశారు.
ఆయన ప్రభుత్వాన్ని కాపాడినప్పుడు ఎవరూ మాట్లాడని నేతలు ఇప్పుడు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. పాల్వాయి ఇంటికి వెళ్తే ఓకే చిరు ఇంటికి వెళ్తే ఆక్షేపణా అన్నారు. బలహీనవర్గాల నేత రాష్ట్రానికి వచ్చినప్పుడు వారిని విమర్శించడం ఇక్కడి నేతలకు అలవాటుగా, ఆనవాయితీగా మారిందని కౌంటర్ వేశారు. ఉప ఎన్నికలలో పార్టీని బలోపేతం చేసేందుకే రవి పర్యటన అన్నారు.
కాగా రాజ్యసభ సభ్యుడు, తిరుపతి మాజీ శాసనసభ్యుడు చిరంజీవి ఇంటికి కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర పార్టీ పరిస్థితులు సరిదిద్దేందుకు వచ్చిన వాయలార్ రవిపై కాంగ్రెసు పార్టీ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర రెడ్డి బుధవారం తన అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దామోదర్ రెడ్డి ఉదయం వాయలార్ రవిని కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రవి తన వద్దకు కొంతమందినే పిలుస్తున్నారని, ప్రజారాజ్యం పార్టీ నేతలనే కలుస్తున్నారనే ప్రచారం జరుగుతోందని ఆయన అన్నారు.
ఇలాంటివి సరికావని తాము ఆయనకు చెప్పామన్నారు. రాష్ట్రంలోని పార్టీ నేతల మధ్య ఉన్న విభేదాలు తొలగించేందుకు వచ్చిన నేతలు గ్రూపులను ప్రోత్సహించేలా ఉండకూడదని సూచించారు. గ్రూపులు తొలగించడానికి వచ్చిన నేతలు వాటిని ప్రోత్సహించేలా వ్యవహరిస్తే ఎలా అని ఆయన ప్రశ్నించారు. పార్టీలో గ్రూపులను ప్రోత్సహించవద్దని తాను రవికి చెప్పానన్నారు.
అధికార పర్యటనల కోసం వచ్చినప్పుడు అది సరికాదన్నారు. వ్యక్తిగతంగా ఏమైనా అభిమానం ఉంటే పిలిపించుకొని వారితో మాట్లాడుకోవచ్చునని తెలిపారు. పార్టీ పరిస్థితి ఇలాగే ఉంటే 1994 పరిస్థితులు పునరావృతం అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీలో కొందరి తీరు ఎవరికి వారే అన్న విధంగా ఉందన్నారు. వారిని సమన్వయ పర్చాలని సూచించినట్లు చెప్పారు.
రాష్ట్రంలో పార్టీ పరిస్థితి దారుణంగా ఉందని చెప్పామన్నారు. రాష్ట్ర ముఖ్య నేతల మధ్య సమన్వయం లోపించిందన్నారు. వారిని సమన్వయపర్చాలన్నారు. సమన్వయమంటూ మొన్న గులాంన నబీ ఆజాద్, నిన్న కృష్ణమూర్తి ఇప్పుడు వాయలార్ రవి వచ్చారని, రేపు ఎవరొస్తారని ఎద్దేవా చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.
తెలంగాణకు శ్రీకృష్ణ కమిటీ అన్యాయం చేసిందన్నారు. తెలంగాణపై వెంటనే పార్టీ తేల్చాలని డిమాండ్ చేశారు. అలా అయితేనే తెలంగాణలో పార్టీ బతికి బట్ట కడుతుందని చెప్పారు. నిర్ణయం తీసుకోకుంటే ఇటీవల ఉప ఎన్నికల ఫలితాలే పునరావృతం అవుతాయని చెప్పారు. తెలంగాణపై ఇక్కడి ప్రజలు, నేతల ఆకాంక్షను సోనియా గాంధీకి చెప్పాలన్నారు. ఇదే తమ ఆఖరి అభ్యర్థన అన్నారు.
సోనియా గాంధీ పైన తమకు విశ్వాసముందని ఆయన చెప్పారు. ఢిల్లీ నుండి వచ్చిన పరిశీలకులు ఇక్కడి విషయాలను వాస్తవంగా ఉన్నది ఉన్నట్టు చెబితే సోనియా వెంటనే తెలంగాణ ఇస్తుందని చెప్పారు. తెలంగాణ ఇవ్వాల్సిందేనని ఆయన అన్నారు. తెలంగాణ ఇచ్చే వరకు తాము అధిష్టానంపై ఒత్తిడి తీసుకు వస్తామని చెప్పారు.