వాయలార్ రవి భేటీ: నేరుగా సోనియానే పర్యవేక్షణ

రాష్ట్రంలోని ఉప ఎన్నికల్లో తాము అన్ని సీట్లూ గెలుస్తామని, మళ్లీ హైదరాబాదు వెళ్తానని వాయలార్ రవి సోనియాతో భేటీ అనంతరం చెప్పారు. కాగా, వాయలార్ రవి అటు వెళ్లగానే ఎఐసిసి కార్యదర్శి కెబి కృష్ణమూర్తి ఇటు హైదరాబాద్ వచ్చారు. ఆయన శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రిని మార్చే ఉద్దేశం అధిష్టానానికి లేదని, పార్టీని బలోపేతం చేయడానికే తాము కసరత్తు చేస్తున్నామని కృష్ణమూర్తి చెప్పారు.
తొలుత కృష్ణమూర్తి రాష్ట్రానికి వచ్చి పార్టీ నాయకులందరినీ కలుసుకుని అభిప్రాయాలు సేకరించి సోనియా గాంధీకి నివేదిక ఇచ్చారు. ఆ తర్వాత వాయలార్ రవి రాష్ట్రానికి వచ్చారు. రాష్ట్ర వ్యవహారాలను నేరుగా పర్యవేక్షించాలనే ఉద్దేశంతోనే సోనియా గాంధీ వరుసగా ఢిల్లీ నుంచి పార్టీ ప్రతినిధులను రాష్ట్రానికి పంపుతున్నట్లు చెబుతున్నారు. ఉప ఎన్నికల వ్యూహాన్ని కూడా ఆమె పర్యవేక్షణలోనే జాతీయ నాయకులు రాష్ట్ర నాయకుల ద్వారా అమలవుతాయని చెబుతున్నారు.
రానున్న ఉప ఎన్నికలను సోనియా గాంధీ తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఆమె రాష్ట్ర నాయకులను నమ్మే పరిస్థితి లేదని చెబుతున్నారు. దీంతో ఆమె రాష్ట్ర నాయకులను కట్టడి చేసి, వారిని తమ వ్యూహానికి అనుగుణంగా నడిపించేందుకు సిద్ధపడినట్లు సమాచారం. ఇక నుంచి వాయలార్ రవి క్రమం తప్పకుండా రాష్ట్రానికి వస్తారని అంటున్నారు. గులాం నబీ ఆజాద్ పర్యవేక్షణతో ఫలితాలు కనిపించకపోవడంతో సోనియా గాంధీ వాయలార్ రవిని రంగంలోకి దింపినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications