సబితా రెడ్డి కొడుకుకు భానుకిరణ్తో లింక్: చంద్రబాబు

వాళ్ల సంబంధాలపై అనేక ఆరోపణలున్నాయన్నారు. విజయవాడలో ఒక ఫ్యాక్టరీని కూడా వీళ్లు స్వాధీనం చేసుకొన్నారని వార్తలు వచ్చాయని చెప్పారు. నేరగాళ్లను పట్టుకోవడంతో సరిపోదని, అతనికి ఎవరెవరితో ఎలాంటి సంబంధాలున్నాయో, ఏమేం చేశారో, ఎలాంటి వ్యవహారాలు నడిపించారన్నది నిష్పాక్షికంగా విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
సూరి హత్య తర్వాత పద్నాలుగు నెలలకు భానును పట్టుకోగలిగారని, కనీసం ప్రాణాలతో పట్టుకోవడం పెద్ద ఘనతేనని చెప్పారు. తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి పరిటాల రవి హత్య కేసుతో సంబంధాలు ఉన్న వారంతా ఒకరి తర్వాత మరొకరు హత్యకు గురయ్యారన్నారు. మొదట ఒక వైద్యునితో మొదలైన హత్యల పరంపర మొద్దు శీనుతో కొనసాగి మద్దెల చెరువు సూరి వరకూ వచ్చిందన్నారు.
భాను కిరణ్ కూడా హత్యకు గురయ్యాడని కొంత కాలం కిందట ప్రచారం జరిగిందన్నారు. పరిటాల హత్య కేసులో ఆధారాలు లేకుండా చేయడానికి ఇలా వరుస హత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. చివరకు జైల్లో కూడా హత్యలు జరిగాయని విమర్శించారు. ప్రస్తుతం భాను కిరణ్ పోలీసులో అదుపులో ఉన్నందున వాస్తవాలు బయటపెట్టే విధంగా విచారణ జరగాలని ఆయన కోరారు. హోంమంత్రి తనయుడితో కలిసి భాను రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, సెటిల్మెంట్లు చేసినట్లు వార్తలొచ్చినందున ఆ దిశలో విచారణ చేయాలన్నారు. కాగా చంద్రబాబు వ్యాఖ్యలను సబితా ఇంద్రా రెడ్డి కొట్టి పారేశారు.












Click it and Unblock the Notifications