మోహన్ బాబుతో జగన్ భేటీ: చిరు స్థానంపై భయమా?

చిరంజీవి రాజీనామాతో ఖాళీ అయిన తిరుపతి ఒక్కటే ఆయనను కలవరపరుస్తోందని అంటున్నారు. అక్కడ కాంగ్రెసుకు గట్టి పట్టు ఉండటంతో పాటు, చిరంజీవి స్థానం, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సొంత జిల్లా. దీంతో అక్కడ కాంగ్రెసు గెలుపు నల్లేరు మీద బండి నడకే అనే వాదనలు వినిపిస్తున్నాయి. మిగతా పదిహేడు స్థానాలలో పోటీకి పలువురు కాంగ్రెసు నేతలు వెనక్కి పోతున్నప్పటికీ తిరుపతిలో మాత్రం మంత్రి గల్లా అరుణ కుమారి తనయుడు గల్లా జయదేవ్, మాజీ ఎమ్మెల్యే వెంకట రమణ పోటీ పడుతున్నారు.
అక్కడ గెలుపు ఖాయమనే గట్టి నమ్మకంతోనే వారు పోటీ పడుతున్నారు. మిగిలిన నియోజకవర్గాలలో గెలుపుపై ఉన్నంత ధీమా తిరుపతిపై జగన్లో లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో అక్కడే మంచి పట్టున్న మోహన్ బాబును తన వైపుకు తిప్పుకుని తిరుపతిని కూడా తన పరం చేసుకోవాలనే వ్యూహంలో భాగంగానే జగన్ ఆయనను కలిశారని అంటున్నారు. మోహన్ బాబు స్వగ్రామం తిరుపతి - శ్రీకాళహస్తికి మధ్యలోని ఓ గ్రామం.
అంతేకాకుండా ఆయన పాఠశాలలు ప్రారంభించి మంచి విద్యను అందిస్తున్నారు. మోహన్ బాబు కార్యక్రమాలు స్థానిక ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఆయనను హీరోగా మాత్రమే కాకుండా సామాజిక స్పృహ కలిగిన వ్యక్తిగా గౌరవిస్తారు. దీనికి ఆయన సినిమా ఇమేజ్ అదనం. తిరుపతిలో మోహన్ బాబుకు మంచి పలుకుబడి ఉంది. ఈ ఉద్దేశ్యంతోనే తెలుగుదేశం పార్టీ మోహన్ బాబును గానీ, ఆయన కూతురును గానీ తిరుపతి బరిలో దింపుదామా అనే చర్చ జరిపిందట.
అయితే ఇప్పుడు తిరుపతిపై బెంగతో ఉన్న జగన్ ఆయనను కలిసి అక్కడ తమకు మద్దతివ్వాలని కోరారని అంటున్నారు. తమ మధ్య ఎలాంటి రాజకీయ చర్చ జరగలేదని, కొట్టి పారేసిన మోహన్ బాబు మిగతా విషయాలు సమయం వచ్చినప్పుడు మాట్లాడతానని చెప్పారు. అంటే రాజకీయ చర్చ జరగలేదని ఆయన కొట్టి పారేస్తున్నప్పటికీ అది వాస్తవం కాకపోయి ఉండవచ్చునని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
విష్ణువర్ధన్ - వెరోనికాలకు కవలలు పుట్టడంతో వారికి శుభాకాంక్షలు తెలిపేందుకు జగన్ తన సతీమణి భారతితో సహా వచ్చారు. అయితే భారతి వెళ్లాక జగన్ పదినిమిషాలు ప్రత్యేకంగా మోహన్ బాబుతో మాట్లాడారట. వారు ఖచ్చితంగా రాజకీయాలపై మాట్లాడి ఉంటారని అంటున్నారు. శుభాకాంక్షలు ఒక కారణమైనప్పటికీ, తిరుపతిలో మోహన్ బాబు మద్దతు కోరేందుకే జగన్ ప్రత్యేకంగా వెళ్లి ఉంటారని అంటున్నారు.
ఇప్పటికే జగన్ గోదావరి జిల్లాల్లో చిరంజీవిని ఎదుర్కొనేందుకు మాజీ ఎంపీ కృష్ణంరాజును బరిలోకి దింపుతున్నారనే ప్రచారం జరిగింది. తాజాగా తిరుపతిలో చిరును ఎదుర్కొనేందుకు జగన్ నుండి మాత్రం మోహన్ బాబుకు ఖచ్చితంగా ప్రపోజల్ వెళ్లి ఉంటుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications