సమయమొచ్చినప్పుడు: జగన్తో భేటీపై మోహన్ బాబు

తమ మధ్య ఎలాంటి రాజకీయపరమైన చర్చ జరగలేదని ఆయన చెప్పారు. సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు చెబుతానని అన్నారు. జగన్ బంధువుగానే కలిశారని చెప్పారు. మిగతా విషయాలు ఇప్పుడు చెప్పలేనన్నారు. కొద్దిరోజుల క్రితం విష్ణుకు కవల పిల్లలు పుట్టారని, అందుకే జగన్, ఆయన సతీమణి భారతి చుట్టపు రూపంగా శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చారని తెలిపారు.
కాగా భేటీలో ఏం జరిగిందని, రాజకీయంగా ఏమైనా సమీకరణాలు మారుతాయా అని విలేకరులు మోహన్ బాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు. అందుకు ఆయన మీకు దండం పెడతాను, మీరంతా నావాళ్లే తనకు షూటింగ్ పని ఉందని చెప్పి కారులో వెళ్లిపోయారు. కాగా జగన్ తన సతీమణి భారతితో కలిసి మోహన్ బాబు ఇంటికి వెళ్లారు.
ఇటీవల అరవయ్యో పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న మోహన్ బాబు తన వేడుకలకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును ఆహ్వానించారు. ఆ కార్యక్రమంలో ఇరువురు ఒకరిపై మరొకరు పొగడ్తల వర్షం కురిపించుకున్నారు. అప్పటి నుండి మోహన్ బాబు తెలుగుదేశం పార్టీలో చేరతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో జగన్ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.












Click it and Unblock the Notifications