మారీచుడు: జగన్పై బాబు నిప్పులు, సాక్షిది బ్లాక్మేల్

అసమర్థ, అవినీతి పాలనతో ప్రభుత్వం కొనసాగుతుండగా, మరొకరు హత్యా రాజకీయాలు, బెదిరింపులు, సెటిల్మెంట్లతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వైయస్ జగన్ను ఉద్దేశించి అన్నారు. వీరందరికి బుద్ది చెప్పకపోతే రాష్ట్ర భవిష్యత్తు ఆందోళనకరంగా మారుతుందని ప్రజలను హెచ్చరించారు.
విజయనగరం జిల్లాలో 140 మద్యం దుకాణాలు ఉండగా అందులో 103 తెల్లకార్డుదారులకే ఉన్నాయన్నారు. అక్కడ మొదట తన ధర్నాను వద్దన్నారని, కానీ ధైర్యంగా ముందుకడుగు వేయడంతో తోకముడిచారని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను ఉద్దేశించి అన్నారు. సైకిల్కు ఎవరైనా అడ్డొస్తే తొక్కించేస్తామన్నారు.
పరిటాల రవీంద్ర హత్యకు కుట్ర పన్నిన మంగళి కృష్ణను నాడు వైయస్ ఎంతో మంచోడంటూ వెనుకేసుకొచ్చాడని ఆరోపించారు. ఇప్పుడు అతడికి కోర్టు శిక్ష విధించిందన్నారు. జగన్ దీనికి ఏం సమాధానం చెబుతారన్నారు. మంగళి కృష్ణ తనకు ఆయుధాలు ఇచ్చాడని, ఇద్దరం కలిసి వ్యాపారాలు చేశామని సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ సిఐడి ఎదుట ఒప్పుకున్నారన్నారు. వీరి వెనుక జగన్ ఉన్నారన్నారు.
బిజెపి నేత బంగారు లక్ష్మణ్ చిన్న తప్పుకు జైలుకెళ్లారని, కోట్లాది రూపాయలు దోపిడి చేసి, కేసులు ఎదుర్కొంటున్న జగన్ను మాత్రం ఈ ప్రభుత్వం ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. పరిటాల తర్వాత హత్యల పరంపర కొనసాగిందని, భాను కిరణ్ లొంగిపోకుంటే అతనిని కూడా హతమార్చే వారని అనుమానం వ్యక్తం చేశారు.
తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రౌడీలు, గూండాలు రాష్ట్రం విడిచి వెళ్లేలా చేశానని, ఇప్పుడు అందుకు భిన్నంగా ఉందన్నారు. మంగళి కృష్ణ, భాను కిరణ్ దురాగతాలు సాక్షి పత్రిక, ఛానల్లో ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. సాక్షి బ్లాక్ మెయిల్ ధోరణికి పాల్పడుతోందని విమర్శించారు. అవినీతితో పుట్టిన అది అసత్యాలు రాస్తోందన్నారు.












Click it and Unblock the Notifications