బాబు ఆదేశిస్తే బాలకృష్ణ సై, జగన్తో వంశీపై నో కామెంట్

పార్టీ ప్రచారం చేయమని ఆదేశిస్తే ఆయా నియోజకవర్గాలలో అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి.. వల్లభనేని వంశీ కలయికతో నారా, నందమూరి కుటుంబాల మధ్య విభేదాలు వచ్చాయన్న అంశంపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు. ఇప్పుడు నో పాలిటిక్స్ అంటూ విముఖత వ్యక్తం చేశారు.
కాగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవనంలో మంగళవారం మేడే కార్మిక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు బొజ్జల గోపాల కృష్ణ రెడ్డి, కడియం శ్రీహరిలు మాట్లాడారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కార్మికులకు ఎంతో మంచి చేశారని, అయినప్పటికీ ఆయన చెడ్డపేరు తెచ్చుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు బాబును అపార్థం చేసుకున్నారన్నారు.
ఇప్పుడిప్పుడే వారు వాస్తవాలు తెలుసుకుంటున్నారని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాయని కడియం శ్రీహరి అన్నారు. కార్మికుల హక్కుల సాధన కోసం ఐక్య పోరాటాలు చేయాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన చెప్పారు.
కాగా గత 2009 సాధారణ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున బాలకృష్ణ ఉధృత ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇటీవల కాలంలో ఆయన తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి సై అన్నారు. వచ్చే సాధారణ ఎన్నికలలో పార్టీ ఆదేశించిన అసెంబ్లీ స్థానంలో పోటీ చేస్తానని చెప్పారు. అయితే ఉప ఎన్నికలలో ఆయన ప్రచారం టిడిపికి ఏ మేరకు లాభిస్తుందో చూడాలి.
మరోవైపు బాలకృష్ణ ప్రచారంపై పార్టీలో ఎలాంటి చర్చ జరగడం లేదని తెలుస్తోంది. చంద్రబాబు ఇప్పుడు ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు. ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత బాలయ్య ప్రచారంపై చర్చించనున్నారని తెలుస్తోంది. మరోవైపు బాలకృష్ణ వంటి స్టార్ కంపెయినర్తో ఉప ఎన్నికలలో ప్రచారం చేయించడం అవసరమా అనే చర్చ కూడా సాగుతోందట.












Click it and Unblock the Notifications