చెప్పకుంటే 'యస్' 'నో' చెప్పలేం: తెలంగాణపై చిదంబరం

Chidambaram
న్యూఢిల్లీ: తెలంగాణ ఇస్తామనో, ఇవ్వలేమనో ఇప్పట్లో చెప్పడం సాధ్యం కాదని కేంద్రహోంమంత్రి చిదంబరం బుధవారం చెప్పారు. లోకసభలో బుధవారం తెలంగాణ ఎంపీల డిమాండ్ల నేపథ్యంలో చిదంబరం నోరు విప్పారు. తెలంగాణపై తేల్చేదాకా సభను బహిష్కరిస్తామని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కుండబద్దలు కొట్టగా ఇప్పట్లో తేల్చే అవకాశమే లేదని చెప్పారు. కాంగ్రెసు తన వైఖరిని త్వరలో చెబుతుందన్నారు.

అలాగే మిగిలిన పార్టీలు కూడా తమ వైఖరిని చెబితేనే సాధ్యమైనంత త్వరగా తెలంగాణ సమస్యను పరిష్కరించగలమని ఆయన చెప్పారు. టి-నేతల డిమాండ్లకు తలొగ్గి ఏదో ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదని చెప్పకనే చెప్పారు. కేంద్రం నిర్ణయాన్ని రాష్ట్రంపై
రుద్దమని, తెలంగాణ ఇచ్చేదీ లేనిదీ స్పష్టంగా చెప్పలేనని, నేనే కాదు, ఏ హోంమంత్రీ చెప్పలేరని, అక్కడి పరిస్థితి మీకందరికీ తెలుసని ఆయన చెప్పారు.

పార్టీలు తమ అభిప్రాయం వెల్లడించేందుకు నిర్దిష్టమైన గడువేమీ లేదని చెప్పారు. కాంగ్రెస్ మాత్రం త్వరలోనే తన వైఖరి చెబుతుందన్నారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదికను తెలంగాణ నేతలు తిరస్కరించగా... తెలంగాణపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆ నివేదికే ప్రాతిపదికగా ఉంటుందని చెప్పారు. మరోవైపు... సభకు దూరంగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపిలకు సర్ది చెప్పేందుకు వయలార్ రవి, ఆజాద్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.

లోక్‌సభలో కేసీఆర్, విజయశాంతితోపాటు టిడిపి ఎంపీలు నామా నాగేశ్వరరావు, రమేశ్ రాథోడ్ సంయుక్తంగా తెలంగాణ నినాదాలు చేశారు. వారి ఆందోళనల నడుమే ప్రశ్నోత్తరాల సమయం జరిగింది. తెలంగాణపై కేంద్రం తన నిర్ణయాన్ని రుద్దదని కేంద్ర హోం మంత్రి చిదంబరం స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఎనిమిది ప్రధాన పార్టీలు తెలంగాణపై ఒక వైఖరి ఏర్పర్చుకున్న తర్వాతే ప్రత్యేక రాష్ట్ర అంశంపై ఏదైనా పురోగతి ఉంటుందన్నారు.

ఆ పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చేందుకు మరింత సమయం తీసుకుంటే మాత్రం నేను వారిని నిందించనని చెప్పారు. ఎందుకంటే.. ఈ అంశాన్ని నిర్ణయించడంలో వారికి కీలక పాత్ర ఉందన్నారు. కేంద్ర హోం శాఖ పద్దుపై లోక్‌సభలో బుధవారం జరిగిన చర్చకు చిదంబరం సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు తెలంగాణ ఇచ్చేదీ లేనిదీ స్పష్టంగా ప్రకటించాలని చేసిన డిమాండ్‌పై ఆయన స్పందించారు.

2009 డిసెంబర్ 9న పార్లమెంటులో తాను ప్రకటన చేసేప్పటికి రెండు రోజుల ముందు ఆంధ్రప్రదేశ్‌లో.. తెలంగాణపై అఖిలపక్ష సమావేశం జరిగిందని గుర్తు చేశారు. తాను ప్రకటన చేసిన రోజున ఇదే అంశంపై లోక్‌సభ బిఏసి కూడా చర్చించిందని వెల్లడించారు. తాను ప్రకటన చేసిన 24 గంటల్లోనే పరిస్థితులు నాటకీయంగా మారిపోయాయని, అధికారంలో ఉన్న తమ కాంగ్రెస్ పార్టీతో సహా రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ తమ వైఖరిని మార్చేసుకున్నాయని చెప్పారు.

ఈ పరిణామాల కారణంగానే 2009 డిసెంబర్ 9న చేసిన ప్రకటనను.. అదే ఏడాది డిసెంబర్ 23న మార్చాల్సి వచ్చిందని వివరించారు. అయితే, రాష్ట్రంలోని 8 ప్రధాన పార్టీలు తెలంగాణపై ఒక వైఖరి ఏర్పర్చుకున్న తర్వాత మాత్రమే ఈ అంశంపై ఏదైనా పురోగతి ఉంటుందని తేల్చి చెప్పారు.

ఈ సందర్భంగా తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు నామా నాగేశ్వరరావు, ఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ నినాదాలు చేశారు. తొలుత కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. దీంతో చిదంబరం స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ కూడా త్వరలోనే ఒక నిర్ణయానికి వస్తుందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+